
చిత్తూరు జిల్లా పుంగనూరులో జరిగిన ఘర్షణలపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పుంగనూరు ఘటనకు చంద్రబాబే కారణమన్నారు. బైపాస్ మీదుగా వెళతామని పోలీసులకు రూట్ మ్యాప్ ఇచ్చి.. ఆ తర్వాత పుంగనూరు పట్టణంలోకి టీడీపీ కేడర్ రావాలని చూసిందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రూటు మార్చడం వల్ల చంద్రబాబుకు ఏమైనా జరుగుతుందన్న భయంతో పోలీసులు దానికి అంగీకరించలేదని.. కానీ ఆయన మాత్రం టీడీపీ కార్యకర్తల్ని రెచ్చగొట్టి పోలీసులపై దాడి చేయించారని పెద్దిరెడ్డి ఆరోపించారు.
కాన్వాయ్లోనే టీడీపీ నేతలు తుపాకులు, రాళ్లు తెచ్చారని మంత్రి ఆరోపించారు. రాజకీయంగా పోటీ పడలేమని తెలిసి చంద్రబాబు ఈ తరహా దాడులకు తెరలేపారని మంత్రి మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతానన్న భయంతో రాష్ట్రంలో చంద్రబాబు హింసను ప్రోత్సహిస్తున్నారని పెద్దిరెడ్డి ఆరోపించారు. కాలేజీ సమయం నుంచి చంద్రబాబు తనను టార్గెట్ చేశారని.. మా ప్రాంతంలో మూడు ప్రాజెక్ట్లు కడుతుంటే, కేసులు వేసి అడ్డుకున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ALso Read: పరిటాల రవి హత్య.. విధ్వంసం చేయాలని నాకు, కరణం బలరామ్కు ఫోన్ , చంద్రబాబు అలాంటోడు : నల్లపరెడ్డి
అంతకుముందు వైసీపీ నేత, నెల్లూరు జిల్లా కొవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..పుంగనూరులో చంద్రబాబు కొత్త డ్రామాలకు తెరలేపారని దుయ్యబట్టారు. టీడీపీ నేతలకు సంబంధించిన వాహనాల్లో రాళ్లు, రాడ్లు, కర్రలు, బీర్ బాటిళ్లు, గన్స్ వున్నాయని ప్రసన్నకుమార్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు పక్కా ప్లాన్తో గొడవలు చేయించి దానిని వైసీపీకి పులిమి లబ్ధి పొందాలని చూశారని ఆయన ఫైర్ అయ్యారు.
పరిటాల రవి హత్య సమయంలో తాను టీడీపీ ఒంగోలు ఇన్ఛార్జ్గా వున్న విషయాన్ని ప్రసన్నకుమార్ రెడ్డి గుర్తుచేసుకున్నారు. ఈ సమయంలో కరణం బలరామ్కు, తనకు చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసి బస్సులు తగులబెట్టండి, విధ్వంసం చేయండి, షాపులను ధ్వంసం చేయమని చెప్పారని నల్లపరెడ్డి అన్నారు. చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు కలిగిన వ్యక్తి అని ఆయనో పెద్ద రౌడీ అని ప్రసన్నకుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పుంగనూరులో పోలీసులపై దాడులు చేశారని.. దీని వెనుక చంద్రబాబు హస్తం వుందని ఆయన ఆరోపించారు. ఇలాంటి పనులు చేసేది చంద్రబాబేనని.. దానికి తాను, కరణం బలరామ్ సాక్ష్యులమని నల్లపరెడ్డి పేర్కొన్నారు.