విశాఖకు షిఫ్ట్ అయ్యేందుకు సీఎం జగన్ రెడీ.. అక్టోబర్ 24 నుంచి అక్కడే నివాసం..!

Published : Aug 05, 2023, 04:17 PM IST
విశాఖకు షిఫ్ట్ అయ్యేందుకు సీఎం జగన్ రెడీ.. అక్టోబర్ 24 నుంచి అక్కడే నివాసం..!

సారాంశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన నివాసాన్ని విశాఖపట్నంకు షిఫ్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇందుకు సంబంధించి ముహుర్తం కూడా  ఖరారు అయినట్టుగా  తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన నివాసాన్ని విశాఖపట్నంకు షిఫ్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇందుకు సంబంధించి ముహుర్తం కూడా  ఖరారు అయినట్టుగా  తెలుస్తోంది. అక్టోబర్ 24 నుంచి సీఎం జగన్ విశాఖలోనే నివాసం ఉండనున్నారని సమాచారం. రుషికొండలో నిర్మాణం అవుతున్న భవన సముదాయంలోనే సీఎం క్యాంప్ ఆఫీసు ఉండనుంది. ఇందుకు సంబంధించిన పనులు పూర్తి కావడానికి వచ్చాయి. ఇప్పటికే సివిల్ వర్క్స్ పూర్తి కాగా, ప్రస్తుతం ఇంటీరియర్ వర్క్స్ జరుగుతున్నారు. ఇందుకు సంబంధించి పనులను తాజాగా ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు కూడా పరిశీలించారు. 

అలాగే రుషికొండలో జరుగుతున్న నిర్మాణాల సైట్‌లో భద్రతను కూడా ముఖ్యమంత్రి భద్రత సిబ్బంది పరిశీలించినట్టుగా తెలుస్తోంది. ఆ ప్రాంతంలో ఏపీఎస్సీ బెటాలియన్ ఔట్ పోస్టు కూడా ఏర్పాటు చేశారు. అయితే రాజధాని అంశంలో కొన్ని న్యాయపరమైన చిక్కులు ఉన్నప్పటికీ.. సీఎం జగన్ విశాఖ నుంచి పాలన సాగించడానికి అవి ఆటంకం కాకపోవచ్చని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఎగ్జిక్యూటివ్ హెడ్‌గా ఉన్న ముఖ్యమంత్రి తనకు నచ్చిన ప్రదేశం నుంచి పనిచేయాలని నిర్ణయించుకుంటే ఎటువంటి చట్టపరమైన సమస్య ఉండదని.. కోర్టులు కూడా ఈ విషయంలో విభేదించకపోవచ్చని పేర్కొంటున్నాయి. దసరా (అక్టోబర్ 24) నుంచి విశాఖపట్నం నుంచే జగన్ పాలన సాగిస్తారని చెబుతున్నాయి.

ఇదిలాఉంటే, సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన  తర్వాత పరిపాలన వికేంద్రీకరణను తెరమీదకు తీసుకుని వచ్చారు. కాన్సెప్ట్‌ను తీసుకొచ్చి అమరావతిని శాసన రాజధానిగా, కర్నూల్ ను న్యాయ రాజధానిగా, విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించారు. అయితే ఆ తర్వాత పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. మూడు రాజధానుల బిల్లు తీసుకురావడం.. ఆ తర్వాత ఉపసంహరించుకోవడం జరిగింది. అయితే మూడు రాజధానులు బిల్లు తెచ్చి తీరుతామని వైసీపీ వర్గాలు చెబుతూ వస్తున్నాయి.

మరోవైపు ప్రస్తుతం అమరావతి రాజధానిపై దాఖలైన పిటిషన్లపై విచారణ సుప్రీం కోర్టులో పెండింగ్‌‌లో ఉంది. అయితే పరిపాలన వికేంద్రీకరణను తీసుకొచ్చిన సీఎం జగన్.. విశాఖ నుంచి పాలన సాగించాలని ఎప్పటినుంచో భావిస్తున్నారు. ఇక, ఈ ఏడాది జనవరిలో సీఎం జగన్ ఢిల్లీ వేదికగా మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో తమ రాజధాని విశాఖపట్నంకు మారబోతున్నట్టుగా ప్రకటించారు. ఇక, ఈ ఏడాది  ఏప్రిల్‌లో సీఎం జగన్ మాట్లాడుతూ.. సెప్టెంబర్ నుంచి విశాఖపట్నం నుంచే పాలన సాగించనున్నట్టుగా  ప్రకటించారు. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా రాష్ట్రంలో అతిపెద్ద నగరం, అందరికి ఆమోదయోగ్యమైన విశాఖలోనే తాను సెప్టెంబర్ నుంచి కాపురం పెట్టబోతున్నట్టుగా తెలిపారు. అయితే దసరా రోజున(అక్టోబర్ 24) విశాఖలో నివాసం ఉండాలనే సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

మోదీకి గాడ్సే కి తేడా ఉందా? YS Sharmila Comments | AP Congress | Asianet News Telugu
YS Jagan Comments: రాంబాబు చేసిన పనికి పొగడాలి అంబటిపై జగన్ కామెంట్స్| Asianet News Telugu