వైసీపీ ఎంపీలే జగన్ ని అసహ్యించుకుంటున్నారు..దేవినేని

First Published Jul 21, 2018, 11:01 AM IST
Highlights

‘పార్లమెంట్‌కు రారు...అసెంబ్లీకి రారు’..ఇక ఎక్కడ మాట్లాడుతారో వైసీపీ నేతలనే అడగాలని మంత్రి ఎద్దేవా చేశారు.
 

వైసీపీ ఎంపీలే జగన్ ని అసహ్యించుకుంటున్నారని  ఏపీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు. జగన్ కారణంగానే రాష్ట్రం కోసం పోరాడే అవకాశాన్ని వైసీపీ ఎంపీలు కోల్పోయారని ఆయన మండిపడ్డారు.

బీజేపీతో యుద్ధమంటూనే టీడీపీ లోపాయికారి ఒప్పందం చేసుకుందని జగన్ ఆరోపించిన సంగతి తెలిసందే. కాగా జగన్ వ్యాఖ్యలపై మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు.  శనివారం మీడియాతో మాట్లాడుతూ కుమ్మక్కు రాజకీయాలు ఎవరివో జగన్‌ మాటలు వింటుంటే అర్థమవుతోందన్నారు. రాజీనామాలు చేసిన వైసీపీ ఎంపీలే జగన్‌ను అసహ్యించుకుంటున్నారని ఆయన తెలిపారు. ‘పార్లమెంట్‌కు రారు...అసెంబ్లీకి రారు’..ఇక ఎక్కడ మాట్లాడుతారో వైసీపీ నేతలనే అడగాలని మంత్రి ఎద్దేవా చేశారు.
 
రాజీనామాలతో పలాయనవాదం బయటపడిందని విమర్శించారు. టీడీపీ ఎంపీలు పార్లమెంట్‌లో పోరాడుతుంటే వైసీపీ నేతలు ఇంట్లో పడుకున్నారని మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. కేంద్రం నిర్లక్ష్యం, మొండి వైఖరి అవలంబిస్తోందని, ప్రధాని మోదీ అహంకారంతో మాట్లాడారని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కేంద్రం మెడలు వంచి హోదా సాధిస్తామని మంత్రి స్పష్టం చేశారు. కేంద్రం తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు చేపడతామని, ఏపీకి మోదీ చేసిన అన్యాయంపై ప్రజలకు వివరిస్తామని మంత్రి దేవినేని ఉమ తెలిపారు.

click me!