
ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఈరోజు పోలవరం ప్రాజెక్టును పరిశీలించారు. ఈ సందర్బంగా పోలవరం నిర్మా పనులపై మంత్రి అంబటి రాంబాబు ఆరా తీశారు. డయాఫ్రమ్ వాల్, కాఫర్ డ్యామ్ దగ్గర వరదపై సమీక్ష చేపట్టారు. అనంతరం అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ప్రియారిటీకి భిన్నంగా పనులను చేపట్టిందని విమర్శించారు. ప్రోటోకాల్కు విరుద్దంగా అప్పర్ డ్యామ్ పనులు ప్రారంభించారని.. దాని వల్ల తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పారు. గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు.
గత ప్రభుత్వం పోలవరాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. గత ప్రభుత్వం తప్పిదాల వల్లే ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమని చెప్పారు. అప్రోచ్, స్పిల్ ఛానల్ పనులు అసంపూర్తిగా ఉన్నప్పటికీ లోయర్, అప్పర్ కాపర్ డ్యామ్ ప్రారంభించారని విమర్శించారు. గత ప్రభుత్వం లోయర్, అప్పర్ కాపర్ డ్యామ్లను పూర్తిచేయలేదని అన్నారు. పోలవరం ప్రాజెక్టుపై వైసీపీ ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని అన్నారు. ప్రస్తుతం పోలవరానికి 1.23 లక్షల ఇన్ఫ్లో వస్తుందని చెప్పారు. అయితే అప్పర్, లోయర్ కాఫర్ డ్యామ్ల గ్యారెంటీ దాటిపోయిందని అన్నారు.