త్వరలో ఇక్కడి నుంచే పాలన.. రాబోయే రోజుల్లో విశాఖపట్నం సరికొత్తగా : మంత్రి ఆదిమూలపు సురేష్

By Siva KodatiFirst Published Oct 17, 2023, 4:23 PM IST
Highlights

రాబోయే రోజుల్లో సరికొత్త విశాఖను చూడబోతున్నామన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్ . విశాఖ నుంచి త్వరలోనే పరిపాలన కొనసాగిస్తామని ,  విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. 
 

రాబోయే రోజుల్లో సరికొత్త విశాఖను చూడబోతున్నామన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్. మంగళవారం విశాఖలో మంత్రి అధ్యక్షతన వీఎంఆర్‌డీఏ సమీక్షా సమావేశం జరిగింది. అనంతరం ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు విశాఖ అభివృద్ధి మీద ఎక్కువ ఫోకస్ చేశామన్నారు. మెట్రో ట్రైన్‌కు సంబంధించిన ప్రతిపాదనలు అడ్వాన్స్‌ స్టేజ్‌లో వున్నాయని సురేష్ తెలిపారు.

విశాఖను నివాసానికి అత్యంత అనువైన నగరంగా మార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. త్వరలో ఉత్తరాంధ్ర అభివృద్ధిపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష చేయనున్నారని ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేసేందుకు జగన్ కృషి చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. విశాఖ నుంచి త్వరలోనే పరిపాలన కొనసాగిస్తామని ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. 

ALso Read: డిసెంబర్‌‌లోగా విశాఖకు మారుతాను.. ఇక్కడి నుంచే పాలన: సీఎం జగన్

ఇకపోతే.. నిన్న విశాఖలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు సీఎం వైఎస్ జగన్. అనంతరం ఆయన ప్రసంగిస్తూ.. తాను త్వరలోనే విశాఖపట్నంకు షిఫ్ట్ అవుతున్నట్టుగా స్పష్టం చేశారు. రాష్ట్రంలోనే అతిపెద్ద సిటీ విశాఖపట్నం అని అన్నారు. విశాఖలో పలు మౌలిక సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయని చెప్పారు. హైదరాబాద్,బెంగళూరు, మాదిరిగా విశాఖ ఐటీ హబ్ గా మారబోతోందని చెప్పారు. ఇప్పటికే విశాఖ ఎడ్యుకేషన్ హబ్‌గా ఉందని చెప్పారు. విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రఖ్యాత సంస్దలు ముందుకొస్తున్నాయని అన్నారు. 

ప్రస్తుతం విశాఖలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉందని.. మరో రెండేళ్లలో ఎక్స్‌క్లూజివ్ సివిలియన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు రానుందని చెప్పారు. త్వరలోనే తాను విశాఖకు షిఫ్ట్ అవుతానని చెప్పారు. విశాఖ నుంచే పరిపాలన జరగబోతుందని అన్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు.  అక్టోబర్‌లోనే విశాఖకు రావాలని అనున్నామని చెప్పారు.

అక్టోబర్‌ నాటికి రావాలనుకున్నానది డిసెంబర్‌కు కావొచ్చని తెలిపారు. అయితే డిసెంబర్‌‌లోపు విశాఖకు మారతానని స్పష్టం చేశారు. తాను వైజాగ్‌లోనే ఉండాలని కోరుకుంటున్నట్టుగా సీఎం జగన్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు అన్ని రకాల మౌలిక వసతులు  కల్పిస్తామని చెప్పారు. ఒక్క ఫోన్ కాల్‌తో ఎలాంటి సదుపాయాలు కావాలన్న కంపెనీలకు కల్పించనున్నట్టుగా తెలిపారు. విశాఖపట్నంలో విస్తారమైన అవకాశాలు ఉన్నాయని అన్నారు.

click me!