భార్య అంత్యక్రియలు జరిగినచోటే... ఇద్దరు పిల్లలతో భర్త ఆత్మహత్య

By Arun Kumar PFirst Published Jul 13, 2021, 11:16 AM IST
Highlights

భార్య మరణాన్ని తట్టుకోలేక ఇద్దరు పిల్లలతో కలిసి భర్త ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. 

ఏలూరు: జీవిత భాగస్వామి మరణాన్ని తట్టుకోలేకపోయిన ఓ వ్యక్తి ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య అంత్యక్రియలు జరిగిన ప్రాంతంలోనే గోదావరి నదిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇలా అభం శుభం తెలియని చిన్నారులతో పాటు తండ్రి కూడా గోదావరి నదిలో శవాలుగా తేలారు.  

ఈ విషాద సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం మండలం గుడ్డిగూడెంకు చెందిన సత్యనారాయణమూర్తి-పోశమ్మ దంపతులకు తొమ్మిదేళ్ల క్రితం వివాహమయ్యింది. వీరికి కూతురు మానస (6), కుమారుడు కార్తీక్‌(3) సంతానం. ఇంటివద్దే కిరాణ దుకాణం నడిపిస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు సత్యనారాయణమూర్తి. ఇలా సాఫీగా సాగుతున్న జీవితంలో ఒక్కసారిగా విషాదం నెలకొంది. 

read more   మున్నేరు ఉద్ధృతి... నదీ మధ్యలో చిక్కుకున్న ఇసుక కూలీలు (వీడియో)

కొద్దిరోజుల క్రితమే అనారోగ్యంతో పోశమ్మ మరణించింది. ఆమె అంత్యక్రియలను గోదావరి ఒడ్డున నిర్వహించారు. అయితే భార్య మరణంతో సత్యనారాయణ తీవ్ర డిప్రెషన్ లోకి వెళ్లాడు. ఇన్నాళ్లు కలిసి బ్రతికిన భార్య లేదన్న వార్త జీర్ణించుకోలేకపోయిన అతడు దారుణ నిర్ణయం తీసుకున్నాడు. ఇద్దరు పిల్లలతో కలిసి ఆదివారం భార్య అంత్యక్రియలు జరిగిన ప్రాంతానికి వెళ్లిన అతడు ముందుగా పిల్లలిద్దరిని గోదావరిలోకి తోసేశాడు. ఆ తర్వాత అతడు కూడా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. 

రాత్రయినా సత్యనారాయణ, పిల్లలు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ముగ్గురూ గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించిన పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో సోమవారం గాలింపు చేపట్టారు. సోమవారం రాత్రివరకు గాలించి ముగ్గురి మృతదేహాలను బయటకు తీశారు. 

click me!