కరోనా లక్షణాలతో బాధపడే వారి పరిస్థితి ఎంత దారుణంగా వుందో తెలియజేసే సంఘటన ఇది.
కర్నూల్: కరోనా లక్షణాలతో బాధపడే వారి పరిస్థితి ఎంత దారుణంగా వుందో తెలియజేసే సంఘటన ఇది. రోగుల పట్ల వైద్య సిబ్బంది నిర్లక్ష్యం పతాక స్థాయికి చేరుకున్న దుర్ఘటన ఇది. కరోనా లక్షణాలతో కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన ఓ వృద్ధుడి పట్ల ఆసుపత్రి సిబ్బంది అత్యంత దారుణంగా వ్యవహరించారు. ఆసుపత్రిలో చేరిన వ్యక్తిని ఎక్స్ రే కోసం బయటికి పంపడంతో రోగి బంధువులు స్ట్రెచర్ పైనే రోడ్డుపై అర కిలోమీటర్ మేర తీసుకెళ్లారు.
కరోనా సమయంలో అందరు ఇంటికే పరిమితం కావాలని అధికారులు చెబుతున్నారు. అవసరమైతే ఇంటివద్దే వైద్యం అందించడానికి సిద్దమని చెబుతున్నారు. అలాంటిది ఆనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి తనకు వైద్యం చేయండి మొర్రో అంటే ఇలా రోడ్డున పడేయడం దారుణమని స్థానికులు మండిపడుతున్నారు. ఆసుపత్రిలో చేరిన వృద్దుడిని ఎక్స్ రే కోసం బయటికి పంపడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.
వీడియో
కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి రాయలసీమ జిల్లాలతో పాటు తెలంగాణ రాష్ట్రం నుంచి కూడ చికిత్స కోసం వస్తుంటారు. ఆసుపత్రిని రాష్ట్ర కొవిడ్ ఆసుపత్రిగా మార్చడంతో ఇతర వ్యాధితో బాధపడుతున్న వారికి ప్రధాన ఆసుపత్రి పక్కనే ఉన్న కంటి ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ వైద్య పరికరాల కొరత ఉండడంతో రోగులను వివిధ వైద్య పరీక్షల కోసం ఆసుపత్రి నుంచి బయటికి వస్తున్నారు. వైద్య పరీక్షల కోసం బయటికి వెళ్లే వారిని అంబులెన్స్ లో తీసుకెళితే బాగుంటుందని స్థానికులు అంటున్నారు.