పోలీస్ శాఖ లోగోలో కూచిపూడి నృత్యం... కృష్ణా జిల్లా పోలీసుల వినూత్న ప్రయత్నం

By Arun Kumar PFirst Published Sep 1, 2021, 1:40 PM IST
Highlights

కేవలం రాష్ట్రంలోనే కాదు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు కూచిపూడి నాట్యానికి మరింత ప్రచారం కల్పించేందుకు కృష్ణా జిల్లా పోలీసుల వినూత్న ప్రయత్నం చేశారు. 

విజయవాడ: స్థానికంగానే కాకుండా దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు వున్న కూచీపూడి నృత్యానికి మరింత ప్రచారాన్ని కల్పించే ప్రయత్నం చేస్తున్నారు కృష్ణా జిల్లా పోలీసులు. జిల్లా పోలీస్ శాఖకు చెందిన నూతన లోగోలో రాజ చిహ్నం కింద భాగంలో నటరాజ భంగిమలో సమరూపం కలిగిన కూచిపూడి నర్తకి ప్రతిమలను పొందుపర్చారు. కూచిపూడి నృత్యానికి మరింత గౌరవాన్ని పెంచే ఈ కొత్త లోగోను తాజాగా జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఆవిష్కరించారు. 

కృష్ణా పోలీసుల కొత్త లోగోలో మూడు సింహాల రాజ చిహ్నం, దాని కింద కూచీపూడి నాట్య భంగిమలో రెండు నర్తకి చిత్రాలు వున్నాయి. వీటి చుట్టుపక్కల రెండు ఆలివ్ బ్రాంచ్‌లు, కిందిబాగంలో రిబ్బన్ పై  బలం, సేవ, త్యాగం అని అక్షరాలతో పొందుపర్చారు. ఈ నూతన లోగోను అధికారికంగా జిల్లా ఎస్పీ ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఎస్పీ సిద్దార్థ కౌశల్ మాట్లాడుతూ... నూతన లోగోలో ప్రత్యేకంగా కూచిపూడి నృత్య భంగిమలను అమర్చడానికి కారణం కూచిపూడి నాట్యం కృష్ణా జిల్లాలో పుట్టడమేనని అన్నారు. కూచిపూడి నాట్యం అనేది స్థానికంగానే కాదు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సాంస్కృతిక వారసత్వం అన్నారు.  భారతదేశంలోని ప్రతి మూలనా కూచిపూడి అంటే ఏమిటో ప్రజలకు తెలుసన్నారు. 

read more  అడుగుకో గుంత-గజానికో గొయ్యి... ఇదీ ఏపీలో రోడ్ల దుస్థితి: పవన్ కల్యాణ్ ఆగ్రహం

''కూచిపూడి నృత్య సంప్రదాయంలో నటరాజ భంగిమ శక్తి, విశ్వ శక్తికి చిహ్నం.  కూచిపూడి నృత్య భంగిమ, రాజ చిహ్నం రెండు పురాతన సంస్కృతి సంప్రదాయాల, దేశభక్తి యొక్క సమ్మేళనాన్ని సూచిస్తుంది. ఇవి రెండూ కలిసి నాగరికత, రాజ్యాంగ విలువలను సూచిస్తాయి'' అని ఎస్పీ పేర్కొన్నారు. 

''ఆలివ్ కొమ్మలు దీర్ఘకాలంగా శాంతి మరియు శ్రేయస్సును సూచిస్తాయి. బలం, సేవ, త్యాగం అనేది మనం నిలబెట్టుకునే కీలక విలువలు. వీటన్నింటిని దృష్టిలో వుంచుకుని నూతన లోగోను రూపొందించాం'' అని ఎస్పీ సిద్దార్థ్ వెల్లడించారు.   

click me!