కరోనా నుండి రక్షణ పొందడానికి తీసుకున్న వ్యాక్సిన్ వికటించి ఓ వ్యక్తి మృతిచెందిన విషాద ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది.
విజయవాడ: కరోనా మహమ్మారి నుండి ప్రాణాలను కాపాడుకోవాలనే అతడి ప్రయత్నమే ప్రాణాలు తీసింది. కరోనా వ్యాక్సిన్ వికటించి కృష్ణా జిల్లా గన్నవరంకు చెందిన ఓ వ్యక్తి మృతి చెందాడు. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత తీవ్ర అస్వస్థతకు గురయిన వ్యక్తి కొన్ని గంటల్లోనే మరణించాడు.
వివరాల్లోకి వెళితే... కృష్ణా జిల్లా గన్నవరం మర్లపాలెంకు చెందిన షేక్ సుభాని(30) తాపీ మేస్త్రీగా పనిచేసేవాడు. 8నెలల క్రితమే ఇతడి భార్య ఓ బిడ్డకు జన్మనిచ్చి మృతి చెందింది. దీంతో ఆ పసిపాపకు తల్లీ తండ్రీ అన్నీ తానే అయి ఆలనా పాలనా చూస్తున్నాడు సుభాని.
read more కొత్తగా 1115 మందికి పాజిటివ్.. చిత్తూరులో అత్యధికం, ఏపీలో 20,11,221కి చేరిన మొత్తం కేసులు
అయితే మంగళవారం సాయంత్రం కరోనా నుండి రక్షణ పొందేందుకు ప్రభుత్వం అందిస్తున్న వ్యాక్సిన్ ను గన్నవరం పంచాయతీలో వేసుకున్నాడు సుభానీ. అయితే ఈ వ్యాక్సిన్ వికటించి నిన్న రాత్రంతా జ్వరం, వాంతులు విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఇలా రాత్రంతా తీవ్ర వేదనను అనుభవించిన అతడు ఇవాళ ఉదయం మృతి చెందాడు.
సుభానీ మృతితో ఏడాది కూడా నిండని కూతురు అనాధగా మారింది. ఈ మృతిపై సమాచారం అందుకున్న పోలీసులు, వైద్య శాఖ అధికారులు విచారణ చేపట్టారు. కరోనా వ్యాక్సిన్ వికటించడం వల్లే సుభానీ మరణం జరిగిందా లేక వేరే అనారోగ్య కారణాలైమయినా వున్నాయా అన్నది ఈ విచారణలో తేలనుంది.