రాయలసీమ ఎత్తిపోతల పథకం.. కేఆర్ఎంబీ నివేదిక సిద్ధం, సర్వత్రా ఉత్కంఠ

By Siva KodatiFirst Published Aug 14, 2021, 8:30 PM IST
Highlights

రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పనులకు సంబంధించిన నివేదికను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సిద్దం చేసింది. కేఆర్‌ఎంబీ నివేదిక ఆధారంగా ఈ నెల 16న ఉల్లంఘన పిటిషన్ పై ఎన్జీటీ విచారణ జరపనుంది.  

రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పనులకు సంబంధించిన నివేదికను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సిద్దం చేసింది. కేంద్ర జలశక్తి శాఖ మార్గదర్శకాలను పరిశీలిస్తే.. రాయలసీమ ప్రాజెక్టు డీపీఆర్ తయారీకి అవసరమైన వాటికి మించి అక్కడ పనులు జరుగుతున్నాయని కృష్ణా బోర్డు బృందం అభిప్రాయపడింది. ఎన్జీటీ ఆదేశాల మేరకు రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించిన అనంతరం కృష్ణా బోర్డు బృందం నివేదిక సిద్ధం చేసింది. కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి రాయిపురే, సభ్యుడు మౌతాంగ్, కేంద్ర జలసంఘం సంచాలకులు దర్పన్ తల్వార్‌తో కూడిన బృందం ఈ నెల 11న ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించిన సంగతి తెలిసిందే.

Also Read:రాయలసీమ ఎత్తిపోతలను సందర్శించిన కేఆర్ఎంబీ బృందం.. 16లోగా ఎన్జీటికి నివేదిక

ప్రాజెక్టు పనులకు సంబంధించిన వివరాలను ఛాయాచిత్రాలతో సహా నివేదికలో పొందుపర్చింది. అప్రోచ్ ఛానల్, ఫోర్ బే, పంప్ హౌస్, డెలివరీ మెయిన్, లింక్ కెనాల్, బ్యాచింగ్ ప్లాంట్, నిర్మాణ సామగ్రి తదితరాల వివరాలతో త్వరలో ఎన్జీటీకి నివేదిక సమర్పించనున్నారు కేఆర్ఎంబీ అధికారులు. ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో పర్యటిస్తున్న సమయంలో అక్కడ ఎలాంటి పనులు జరగడం లేదని కేఆర్‌ఎంబీ బృందం స్పష్టం చేసింది. అయితే నిర్మాణ పనులకు అవసరమైన ఇసుక, ఇతర సామగ్రిని అక్కడ నిల్వ చేశారని తెలిపింది. కేఆర్‌ఎంబీ నివేదిక ఆధారంగా ఈ నెల 16న ఉల్లంఘన పిటిషన్ పై ఎన్జీటీ విచారణ జరపనుంది.  

click me!