కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన జనసేన యువనేత డాక్టర్ మాచర్ల రామకృష్ణ అలియాస్ జనసేన ఆర్కే తన అనుచరులతో కలిసి రాజీనామా చేసారు.
గుడివాడ : ఆంధ్ర ప్రదేశ్ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురవడంతో ఈసారి అలా జరక్కుండా జాగ్రత్తపడుతున్నారు జనసేనాని పవన్ కల్యాణ్. దీంతో రాష్ట్రస్థాయి జనసేనలో మంచి ఊపు వచ్చినా కానీ క్షేత్రస్థాయిలో జనసేన నాయకత్వం పనితీరులో మార్పు రాలేదని ఆ పార్టీ నాయకులే అంటున్నారు. తమకు పార్టీలో సరైన గుర్తింపు, గౌరవం దక్కడంలేదని మరికొందరు కొందరు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇటీవల కొందరు నాయకులు జనసేనకు రాజీనామా చేయగా తాజాగా కృష్ణా జిల్లాకు చెందిన కొందరు యువకులు పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు.
కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన జనసేన యువనేత డాక్టర్ మాచర్ల రామకృష్ణ అలియాస్ జనసేన ఆర్కే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన అనుచరులు, సన్నిహితులతో చర్చించి జనసేన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. అనుచరులతో కలిసి తన రాజీనామా పత్రాన్ని మీడియాముందు ప్రదర్శించారు డాక్టర్ రామకృష్ణ.
వీడియో
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కృష్ణా జిల్లాలో అసలు జనసేన శ్రేణులను పట్టించుకునే నాధుడే లేడన్నారు. ఉన్న కొందరు జనసేన నాయకులు గ్రూపులుగా విడిపోయి ఎవరి వ్యక్తిగత, స్వార్థ ప్రయోజనాల కోసం వారు పనిచేస్తున్నారని అన్నారు. దీంతో పార్టీని నమ్ముకున్న తనలాంటి యువతకు అన్యాయం జరుగుతోందని రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేసారు.
Read More YS Jaganmohan Reddy : ఆడబిడ్డల పేరెంట్స్ కు జగన్ సర్కార్ గుడ్ న్యూస్... ఖాతాల్లో డబ్బులు జమ
జనసేన పార్టీ బలోపేతం కోసం పనిచేసే యువతకు సరైన గుర్తింపు, ప్రాధాన్యత లేదన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే జనసేన పార్టీలో లీడర్లుగా చెప్పుకునేవారు మాత్రమే మిగులుతారని... క్యాడర్ వుండదన్నారు. జనసేన పెద్దలు క్షేత్రస్థాయిలో పార్టీ కార్యాకలాపాలపై దృష్టిపెట్టాలని... అప్పుడు అసలు ఏం జరుగుతోంది? పనిచేసేది ఎవరు? అనేవి అర్థమవుతాయన్నారు. త్వరలోనే తన రాజకీయ భవిష్యత్ గురించి ప్రకటన చేస్తానని మాచర్ల రామకృష్ణ తెలిపారు.