రంగా హత్యకు కారణమైన వాళ్లే ఆయన ఫొటోకు దండలు వేస్తున్నారు: కొడాలి నాని సంచలన కామెంట్స్

By Sumanth KanukulaFirst Published Dec 26, 2022, 1:01 PM IST
Highlights

వంగవీటి మోహనరంగా వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం వేడెక్కింది. అన్నిపార్టీల నేతలు కూడా రంగా విగ్రహాలకు నివాళులర్పిస్తున్నారు. 

వంగవీటి మోహనరంగా వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం వేడెక్కింది. అన్నిపార్టీల నేతలు కూడా రంగా విగ్రహాలకు నివాళులర్పిస్తున్నారు. గుడివాడలో రంగా చిత్రపటానికి మాజీ మంత్రి, వైసీసీ ఎమ్మెల్యే కొడాలి నాని నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వంగవీటి రంగా హత్యకు టీడీపీనే కారణమని ఆరోపించారు. రంగాను చంద్రబాబే హత్య చేయించారని చాలా మంది చెప్పారని అన్నారు. వంగవీటి రంగా వ్యక్తి కాదని.. వ్యవస్థ అని అన్నారు.

రంగా అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీతో విభేదించి, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారని అన్నారు. ఆయనను అడ్డుకోవడంతో పాటు పాతాళానికి తొక్కేయాలని టీడీపీ నేతలు చూశారని అన్నారు. అది కుదరకపోవడంతో హత్య చేశారని ఆరోపించారు. ఎన్టీఆర్, అంబేడ్కర్, రంగా వంటివారు పేద ప్రజల గుండెల్లో నిలిచిపోయే వ్యక్తులు అని అన్నారు. రంగా హత్యతో సంబంధం ఉన్న ఎక్కువ మంది టీడీపీలోనే ఉన్నారని విమర్శించారు. రంగా చావుకు కారణమైన వ్యక్తులు ఆయన ఫొటోకు దండలు వేసి, బూట్లు నాకాల్సిన పరిస్థితి ఉందన్నారు. సొంతపార్టీ వాళ్లనే చంపి..దండలు వేసే చరిత్ర చంద్రబాబుదని విమర్శించారు. 

వంగవీటి రంగా మద్దతుదారులు ఓట్లు తమకు రాకుండా పోతాయని టీడీపీ డ్రామాలు చేస్తుందని మండిపడ్డారు. రంగా ఆశయాల కోసం కృషి చేస్తామని చెప్పారు. రావి వెంకటేశ్వరరావు ఆరోపణలు సరికాదన్నారు. రాజకీయాలకు అతీతంగా రంగా అభిమానులు కలిసి నడుస్తున్నారని చెప్పారు. రాజకీయాలలో తమకు వంగవీటి రంగా ఆదర్శప్రాయుడని చెప్పారు.  తాము చంపేసినోళ్ల ఫొటోలు పెట్టుకుని దండలు వేయమని చెప్పారు. తమ పార్టీ అధినేత సీఎం జగన్.. సోనియా గాంధీని తీసిపారేశారని.. వీళ్లో లెక్కా అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిందని అన్నారు. 
 

click me!