
అమరావతి: ఏపీ ప్రభుత్వం కమీషన్ల కోసం కల్తీ సారా, జే బ్రాండ్ మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తోందని... దీంతో రాష్ట్ర ప్రజల ప్రాణాలు బలవుతున్నాయని టిడిపి (TDP) నాయకులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ విమర్శలను తిప్పుకొడుతూ ప్రతిపక్ష టిడిపిపై మరీ ముఖ్యంగా ఆ పార్టీ చీఫ్ చంద్రబాబు నాయుడు (chandrababu naidu) పై మంత్రి కొడాలి నాని (kodali nani) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చీప్ లిక్కర్ కు బ్రాండ్ బాబేనని.. సారాకు పేరు పెట్టింది టీడీపీ అని అన్నారు. మద్యంలో పుట్టి, మద్యంతోనే పెరిగిన బాబు అండ్ కో వైసిపి ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరంగా వుందని మంత్రి నాని మండిపడ్డారు.
ప్రతిపక్ష టీడీపీ, ఎల్లో మీడియా విమర్శిస్తున్న మద్యం బ్రాండ్లకు ఎవరి ప్రభుత్వ హయాంలో అనుమతులు ఇచ్చారు... ఆ బ్రాండ్లు తెచ్చిన ప్రబుద్ధుడు ఎవరనేదానిపై అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి జగన్ సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టారని మంత్రి పేర్కొన్నారు. ఆ వాస్తవాన్ని అంగీకరించే దమ్మూ, ధైర్యం లేకే టీడీపీ ఎమ్మెల్యేలు డొంకతిరుగుడు మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. అధికారంలో ఉండగా పెద్దఎత్తున కమీషన్లు తీసుకుని డిస్టలరీలకు ఇష్టం వచ్చినట్లు అనుమతులుచ్చిన చంద్రబాబు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసాన్నారు. ఇలా రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్ గా మార్చిన ఘనుడు చంద్రబాబేనని మంత్రి నాని మండిపడ్డారు.
''ఈ రాష్ట్రంలో నాటు సారాను కనిపెట్టిన వ్యక్తే చంద్రబాబు. సారాను బాటిల్లో పోసి, దానికి వారుణి-వాహిని అని పేరుపెట్టింది కూడా టిడిపియే. ఇలాంటి తప్పుడుపనులు వారు చేసి ఇప్పుడేమో జె బ్రాండ్లు అని దుష్ప్రచారం చేస్తూ డిస్టిలరీలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చాలా విచిత్రంగా ఉంది. మేము రద్దు చేస్తే 24 గంటల్లో మళ్ళీ మీరే కోర్టుకు పంపించి స్టే లు తెచ్చుకుంటారు కదా'' అని మంత్రి అన్నారు.
''చంద్రబాబే కదా డిస్టలరీలు పెట్టినవాళ్ల దగ్గర నుంచి కమీషన్లు తీసుకుని ఏకంగా 25 ఏళ్లపాటు నడుపుకునేందుకు లైసెన్స్లు ఇచ్చింది. మేము వాటిని రద్దు చేస్తే వాళ్లంతా కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంటారనే విషయం బాబుకు తెలియదా? తర్వాత వచ్చే ప్రభుత్వాలు కూడా రద్దుచేసే అవకాశం లేకుండా తన హయాంలో డిస్టలరీలను అనుమతులు ఇచ్చిన చంద్రబాబు ఈరోజు మళ్ళీ సిగ్గులేకుండా నంగనాచి మాటలు మాట్లాడుతున్నాడు'' అని మంత్రి నాని మండిపడ్డారు.
''ప్రెసిడెంట్ మెడల్, గవర్నర్ రిజర్వ్, లెజెండ్, 999 పవర్ స్టార్, బూమ్ బూమ్ బీరు... ఇలాంటి పిచ్చి బ్రాండ్లకు అనుమతి ఇచ్చింది చంద్రబాబే. వీటిని మా ముఖ్యమంత్రి నిన్న ఆధారాలతో సహా ప్రజల ముందుకు తెస్తే... టీడీపీకి ఏం చేయాలో తెలియక పిచ్చెక్కిపోయారు'' అన్నారు.
''ఎన్టీఆర్ హయాంలోనే టీడీపీ అభ్యర్థి చేతిలో చంద్రగిరిలో చిత్తుచిత్తుగా ఓడిపోయాడు. ఆ తర్వాత తండ్రిలా ఆదరించి చేరదీసిన ఎన్టీఆర్కే చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడు. ఔరంగజేబులాంటి చంద్రబాబు తనకే కాదు రాబోయే రోజుల్లో ప్రజలకు కూడా వెన్నుపోటు పొడుస్తాడని ఎన్టీఆర్ అప్పుడే చెప్పారు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టే చంద్రబాబును నమ్మితే ఆంధ్ర రాష్ట్రం నాశనం అవుతుందని ఆ పెద్దాయన చెప్పారు. ఇలా వెన్నుపోటుకు పేటెంట్ కలిగిన చంద్రబాబు కమీషన్లు తీసుకుని పార్టీని నడుపడమే కాదు కుటుంబ ఆస్తులను పెంచుకుంటున్నారు. ఇది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఈ విషయాలన్నింటినీ ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా మరోసారి ప్రజలందరికీ తెలియచేశారు'' అని మంత్రి నాని పేర్కొన్నారు.
''రాష్ట్రంలో ప్రజలంతా అమాయకులు... తాము ఏది చెబితే అది నమ్ముతారని అనుకుంటున్నట్లున్నారు. మీకు రోజూ బాకా ఊదే నాలుగు డబ్బా ఛానల్స్, పనికిరాని రెండు చెత్త పేపర్లు వున్నాయి. అవి అదే పనిగా చర్చలు, డిబేట్లు అంటూ గంటలుకొద్దీ సొల్లు పురాణాలు చెబితే ప్రజలు మిమ్మల్ని నమ్ముతారారని అనుకుంటున్నట్లున్నారు. ఆ నలుగురు 420 బ్యాచ్ (చంద్రబాబు నాయుడు, రామోజీరావు, రాధాకృష్ణ, బీఆర్ నాయుడు) తలక్రిందులుగా తపస్సు చేసినా వైసిపి ప్రభుత్వంపై దుష్ప్రచారాలను ప్రజలు నమ్మరు గాక నమ్మరు. ఈ నలుగురు 420లు తాము ఏది చెప్పినా జనాలు నమ్ముతారనే పిచ్చి భ్రమలో బతుకుతున్నారు'' అని మండిపడ్డారు.
''రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలను 175 జిల్లాలు చేయాలని పప్పు లోకేష్ చెబుతున్నాడు. మరి నువ్వు ఏ జిల్లాలో ఉంటావు లోకేష్...? అసలు నీకు నియోజకవర్గమే లేదు? కొత్త జిల్లాలు మీకు ఇష్టం లేనప్పుడు కుప్పంను రెవెన్యూ డివిజన్ చేయాలని చంద్రబాబు లేఖ రాయడం సిగ్గుచేటు కాదా..? చంద్రబాబును ఆ నియోజకవర్గ ప్రజలు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అప్పుడేం చేశావు. ఎందుకు రెవెన్యూ డివిజన్ చేయలేకపోయావు చంద్రబాబూ...? మరోవైపు లోకేష్ మామ హిందుపురాన్నిజిల్లా చేయాలి, రెవెన్యూ డివిజన్ చేయాలని అడుగుతారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మీరంతా ఏం చేశారు.. ?'' అని మంత్రి నాని నిలదీసారు.
''ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు గ్రామ సచివాలయాల ద్వారా గడపగడపకూ సేవలు అందించాలని, ఆర్బీకేల ద్వారా రైతుల సమస్యలను గ్రామాల్లోనే తీర్చాలని, పరిపాలనను వికేంద్రీకరణ చేయాలని, 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేసి ప్రజలకు మరింత చేరువలోకి పరిపాలన తెస్తుంటే దానిపై కూడా ఏడుస్తున్నారు. సీఎం జగన్ తో నేరుగా యుద్ధం చేయడం మీకు చేతగాక వ్యవస్థలను అడ్డుపెట్టుకుని, మేనేజ్ చేసి నీచ రాజకీయాలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడిని నమ్ముకుంటే మీకు కూడా ప్రజలు రాజకీయ సమాధి కడతారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబుకు, టీడీపీకి, మీకు పది కిలోమీటర్ల లోతులో గొయ్యి తీసి పాతిపెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మీరు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరు'' అని మండిపడ్డారు.
''సీఎం జగన్ మీద యుద్ధం చేస్తున్నామంటున్న టీడీపీ నాయకులు చివరికి బౌన్స్ అయ్యి నవ్వులపాలయ్యారు. అయినా సిగ్గులేకుండా పదిమంది ఎమ్మెల్యేలను కూర్చోపెట్టి ప్రెస్మీట్ పెట్టించి, పిచ్చికుక్కలు మొరిగినట్లు చంద్రబాబు మొరిగిస్తున్నాడు. చివరికి ఆడవాళ్లను అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి అవ్వాలనకుని వెక్కి వెక్కి ఏడ్చి, అసెంబ్లీ నుంచి పారిపోయి ఇంట్లో పడుకున్నాడు. మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు పూర్తవగానే ఓ రెండుగంటలు ప్రెస్మీట్ పెట్టి రాష్ట్రంలో ఏదో అయిపోయిందంటూ పిచ్చి కబుర్లు చెప్పడానికి వస్తాడు'' అన్నారు.
''అల్జీమర్స్తో బాధపడుతున్న చంద్రబాబు అండ్ 420 బ్యాచ్ ను 2024 వరకు భరించాల్సిందే. రాబోయే ఎన్నికల్లో ఈ ఎల్లో బ్యాచ్ అందరికీ జగన్ రాజకీయ సమాధి కడతారు. తెలుగుదేశం పార్టీ విష ప్రచారం చేయడంలో దిట్ట. ఆ పార్టీనే ఒక విషపు పార్టీ. ఎన్టీఆర్ దగ్గర నుంచి టీడీపీని దొంగలించిన తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు. అప్పట్లో ఎన్టీఆర్ అమలు చేసిన మద్యపాన నిషేధాన్ని చంద్రబాబు ఎందుకు తొలగించాడో ముందుగా చెప్పాలి. మద్యం, సారా గురించి మాట్లాడేవాళ్లు, చంద్రబాబు ఎందుకు మద్యపాన నిషేధం తొలగించి చీప్ లిక్కర్ను తెచ్చారో సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో చీప్ లిక్కర్ను ప్రవేశపెట్టిందే చంద్రబాబు నాయుడు'' అని మంత్రి నాని పేర్కొన్నారు.
'' చంద్రబాబు తన హయాంలో డిస్టలరీలకు అనుమతి ఇచ్చి, వాటిల్లో తయారు అవుతున్న ఆ బ్రాండ్లు అన్నింటికీ జగన్ అనుమతి ఇచ్చారంటూ ఆరోపణలు చేస్తున్నారు. అబద్ధాలలో మరో అడుగు వేసి, లిక్కర్లో విషం ఉందంటూ నీచ ప్రచారానికి దిగిపోయారు. దశలవారీగా మద్యనిషేధం అమలు చేస్తామంటూ మా ముఖ్యమంత్రి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు. అందుకు కట్టుబడే నిర్ణయాలు తీసుకుంటున్నారు. పేదవాడు మద్యం ముట్టుకుంటే కరెంట్ షాక్ కొట్టినట్లు ఉండాలని రేట్లు పెంచారు. మరి రేట్లు పెంచితే ఆదాయం పెరగదా?'' అని అన్నారు.
''రాష్ట్ర ప్రజలు జగన్ ని, జగన్ ప్రజలను నమ్మారు. మద్యంలోనే పుట్టి మద్యంతోనే వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్న నిష్ట దరిద్రుల సూచనలు మాకు అవసరం లేదు. టీడీపీ ఎమ్మెల్యేలకు శాసనసభ మీద కానీ, ప్రజాస్యామ్యం మీదకానీ నమ్మకం లేదు కాబట్టే... అసెంబ్లీలో మద్యంపై చర్చకు రాకుండా సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్నారు. నారా లోకేష్ది క్వార్టర్ నాలెడ్జ్... ఆయన బాడీతో పాటు బ్రెయిన్ కూడా తగ్గినట్లు ఉంది'' అంటైూ మంత్రి నాని సెటైర్లు విసిరారు.