
అమరావతి: నేను ఉన్నాను..నేను విన్నాను .. నేను చూశాను అన్నది రాష్ట్రంలోని కేవలం 10 వేల ఉద్యోగ ఖాలీలలేనా జగన్ రెడ్డి? అని టిడిపి ఏపీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతను నిలువునా మోసంచేసి జగన్ చరిత్రలో మిగిలిపోయారని అన్నారు. పాదయాత్ర సమయంలో 2.30లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మాటిచ్చి ఇప్పుడు కేవలం 10వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారని... దీంతో మోసపోయామని గ్రహించిన యువత ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
''ఉద్యోగం రాలేదని కర్నూలు జిల్లా చనుగొండ్ల గ్రామంలో గోపాల్ అనే నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే. గోపాల్ కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే రూ.25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించాలి'' అని అచ్చెన్న డిమాండ్ చేశారు.
''రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరో గోపాల్ పరిస్థితి రాకూడదు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చి మాట తప్పి రెండేళ్లలోనే కోటిమందికి ఉపాధి పోగొట్టిన ఘనత జగన్ దే. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని ప్రగల్భాలు పలికిన జగన్ నేడు మోడి కి వంగి వంగి నమస్కారాలు చేస్తున్నాడు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై యువతను దారుణంగా జగన్ దగా చేశారు'' అని ఆరోపించారు.
read more ఇక పోరాటానికి సిద్దం కండి... కర్నూల్ జిల్లాలో నిరుద్యోగి ఆత్మహత్యపై లోకేష్ సీరియస్
''నేడు హోదా తేవడం తనకు చేతగాదని జగన్ చేతులేత్తెశారు. దీనికి రాష్ట్రం ప్రజలకు క్షమాపణ చెప్పాలి. నిరుద్యోగులు పూట గడవక, ఇల్లు సాగక ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కసారి బయటకు వచ్చి వారు పడే ఇబ్బందులను జగన్ రెడ్డి చూడాలి. వచ్చే పరిశ్రమలను కమీషన్ల కోసం తరిమేస్తున్నారు. ఉన్న పరిశ్రమలపై రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు. యువత భవిష్యత్ ను ఏం చేయదలచుకున్నారు.?" అని నిలదీశారు.
''చంద్రబాబు నాయుడు రెండు సార్లు డీఎస్సీ వదిలి నిరుద్యోగులను ఆదుకున్నారు. రెండేళ్లైనా ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు. వాలంటీర్లు జీతాలు పెంచమంటే స్వచ్ఛంద సేవకులు అన్నారు... జాబ్ కేలండర్ లో మాత్రం ఉద్యోగాలు ఇచ్చినట్లు వాలంటీర్లను చేర్చారు. వాళ్లను చూసుకుని మురిసిపోతే సరిపోతుందా.? యువత గురించి పట్టించుకోరా? జగన్ రెడ్డి తీరు మార్చుకోకపోతే యువత చేతిలో పరాభవం తప్పదు'' అని అచ్చెన్న హెచ్చరించారు.