విషమంగా మహేష్ కత్తి ఆరోగ్యం: చెన్నై అపోలోకు తరలింపు

By telugu teamFirst Published Jun 26, 2021, 4:50 PM IST
Highlights

నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహేష్ కత్తి ఆరోగ్యం విషమించినట్లు తెలుస్తోంది. దీంతో మహేష్ కత్తిని మెరుగైన వైద్యం కోసం చెన్నై తరలిస్తున్నట్లు సమాచారం.

నెల్లూరు: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సినీ నటుడు మహేష్ కత్తిని చెన్నైకి తరలించారు. ఆయన ఆరోగ్యం విషమించడంతో మెరుగైన వైద్యం కోసం ఆయనను చెన్నై ఆస్పత్రికి తరలించారు. మహేష్ కత్తి దవడ, కళ్లు తీవ్రగా దెబ్బ తిన్నాయని వైద్యుడు షఫీ చెప్పారు. ఆరోగ్యం ఆందోళనకరంగానే ఉందని ఆయన చెప్పారు. మహేష్ కత్తిని చెన్నైలోని అపోలోకు తరలించారు..

ప్రమాదం జరిగిన తర్వాత ఆస్పత్రికి తీసుకుని వచ్చారని, ఆ సమయంలో మహేష్ కత్తి శరీరంలో అక్సిజన్ లెవెల్స్ పడిపోయాయని నెల్లూరులోని కార్పోరేట్ ఆస్పత్రి వైద్యులు చెప్పారు. తల, కంటి భాగాల్లో తీవ్రమైన గాయాలైనట్లు గుర్తించినట్లు తెలిపారు. 

ఎమర్జెన్సీలో ప్రాథమిక చికిత్స అందించామని, తర్వాత ఐసియూలోకి తరలించి చికిత్స చేశామని వారు చెప్పారు. తలపై తగిలిన గాయాల వల్ల పరిస్థితి కాస్తా విషమంగా ఉందని చెప్పారు. తన ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులకు తెలియజేశామని, వారి కోరిక మేరకు మెరుగైన చికిత్స కోసం చెన్నైకి పంపించామని వారు వివరించారు.

ఇదిలావుంటే, నెల్లూరు: చెన్నై-- కలకత్తా రహదారిపై శనివారం తెల్లవారు ఝామున జరిగిన రోడ్డు ప్రమాదంలో సినీ నటుడు కత్తి మహేష్ గాయపడిన విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం నెల్లూరులోని మెడికవర్ కార్పోరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదంలో మహేష్ తలకు తీవ్రమైన గాయాలు అయ్యాయి.

స్పెషల్ ఐసోలేషన్ లో వెంటిలేటర్ మీద ఉంచి మహేష్ కు డాక్టర్లు చికిత్స చేస్తున్నారు. మరికొన్ని గంటల్లో హెల్త్ బులిటెన్ విడుదల చేస్తామని వైద్యులు చెప్పారు. కత్తి మహేష్ పరిస్థితి విషమంగానే ఉందని అంటున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో మహేష్ తో పాటు డ్రైవర్ కూడా ఉన్నట్లు సమాచారం. 

డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో కత్తి మహేష్ ను పోలీసులు, హైవేపై గస్తీ చేస్తున్న సిబ్బంది గుర్తు పట్టారు. వెంటనే మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. కత్తి మహేష్ బంధువులు, స్నేహితులు ఆస్పత్రికి చేరుకున్నారు. మహేష్ ఆరోగ్య పరిస్థితిపై అనుచరులు ఆరా తీస్తున్నారు.

click me!