యార్లగడ్డది ఏ సామాజిక వర్గమో అందరికి తెలుసు..: హెల్త్ వర్సిటీ పేరు మార్పులో రాజకీయం లేదన్న మంత్రి కారుమూరి

Published : Sep 22, 2022, 02:27 PM IST
యార్లగడ్డది ఏ సామాజిక వర్గమో అందరికి తెలుసు..: హెల్త్ వర్సిటీ పేరు మార్పులో రాజకీయం లేదన్న మంత్రి కారుమూరి

సారాంశం

సీఎం జగన్‌తో సహా తమ పార్టీ నేతలంతా ఎన్టీఆర్‌ను గౌరవించే వాళ్లమని మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు చెప్పారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్చడంలో ఎలాంటి రాజకీయం లేదని అన్నారు. 

సీఎం జగన్‌తో సహా తమ పార్టీ నేతలంతా ఎన్టీఆర్‌ను గౌరవించే వాళ్లమని మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు చెప్పారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్చడంలో ఎలాంటి రాజకీయం లేదని అన్నారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్ ఆరోగ్య శ్రీని ఎన్టీఆర్ ఆరోగ్య శ్రీ అని మార్చినప్పుడు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. తణుకులో బీసీ కమ్యూనిటీ హాల్‌కు జ్యోతిరావు పూలే పేరు పెడితే టీడీపీ హయాంలో ఆ పేరు మార్చి ఎన్టీఆర్ పేరు పెట్టారని చెప్పారు. ఆరోగ్య శ్రీ‌ అంటే వెంటనే వైఎస్సార్ గుర్తొస్తారని అన్నారు. వైఎస్సార్ ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని.. అందుకే హెల్త్ వర్సిటీకి ఆయన పేరు పెట్టాలని ఎక్కువ మంది కోరినట్టుగా తెలిపారు. 

ఎన్టీఆర్ అంటే తమ అందరికి గౌరవం ఉందని.. అందుకే కృష్ణా జిల్లాకు ఆయన పేరు పెట్టామని చెప్పారు. అధికార భాష సంఘం అధ్యక్ష పదవికి యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ రాజీనామా చేశారనే అంశాన్ని ప్రస్తావించగా.. ఆయనది ఏ సామాజిక వర్గమో అందరికి తెలిసిందే కదా అని కామెంట్ చేశారు. యార్లగడ్డ రాజీనామా ఆయన వ్యక్తి గతమని తెలిపారు. 

రాష్ట్రంలో సీఎం జగన్ బీసీలకు పెద్దపీట వేశారని చెప్పారు. తెలుగుదేశం పార్టీ అదినేత చంద్రబాబు నాయుడు ఏ రోజైనా బీసీలకు న్యాయం చేశారా..? అని ప్రశ్నించారు. బీసీ న్యాయమూర్తులకు పదవులు రాకుండా అడ్డుకున్న వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. చంద్రబాబు ఎవరైనా బీసీని రాజ్యసభకు పంపించారా అని ప్రశ్నించారు. చంద్రబాబు బీసీలను కేవలం ఓట్లు వేసే యంత్రాలుగా మాత్రమే చూశారని ఆరోపించారు. వైఎస్ జగన్ ఎంతమంది బీసీలను రాజ్యసభకు పంపారో ప్రజలకు తెలుసునని అన్నారు. 

PREV
click me!

Recommended Stories

NO విడాకులు.. NO డౌట్స్! | TDP - Janasena Alliance News | Asianet News Telugu
లోకేష్ ని ఆటపట్టిస్తున్న పిల్లలు | Nara Lokesh | Asianet News Telugu