టీటీడీపై వస్తున్న ఆరోపణలపై స్వతంత్ర విచారణ చేయిస్తే తప్పేమిటని ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నించారు.
న్యూఢిల్లీ: టీటీడీపై వస్తున్న ఆరోపణలపై స్వతంత్ర విచారణ చేయిస్తే తప్పేమిటని ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. శ్రీవారి ఆభరణాల విషయంలో ఆరోపణలు చేస్తున్న రమణ దీక్షితులు మామూలు వ్యక్తి కాదు కదా అని అన్నారు.
ఆయన బుధవారంనాడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలిశారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఈనెల 26వ తేదీన ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తానని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లయిన సందర్భంగా 26వ తేదీన గుంటూరులో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు.
బీజేపీపై టీడీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడమే తమ ప్రధాన బాధ్యత అని చెప్పారు. ప్రముఖ్య పుణ్యక్షేత్రం తిరుమలలో జరుగుతున్న వ్యవహారాలపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆభరణాల మాయంపై విచారణ చేయించి టీడీపీ ప్రభుత్వం నిజాయితీ నిరూపించుకోవాలని అన్నారు.
టీటీడీ ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు చేసిన ఆరోపణలకు ఏపీ ప్రభుత్వం జవాబు చెప్పి, భక్తుల అనుమానాలు నివృత్తి చేయాలని ఆయన అన్నారు. టీటీడీ వ్యవహారంపై ప్రశ్నించేవారిపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.