తెలుగు అకాడమీలో కోట్లు కొట్టేసిన దొంగలెవరో తేలాలి: కళా వెంకట్రావు డిమాండ్

Arun Kumar P   | Asianet News
Published : Sep 30, 2021, 09:35 AM ISTUpdated : Sep 30, 2021, 09:50 AM IST
తెలుగు అకాడమీలో కోట్లు కొట్టేసిన దొంగలెవరో తేలాలి: కళా వెంకట్రావు డిమాండ్

సారాంశం

జగన్ ముఖ్కమంత్రి అయిననాటి నుంచి తెలుగు భాషను, తెలుగు అకాడమినీ నిర్లక్ష్యం చేస్తూ తెలుగుకు తెగులు పట్టిస్తున్నారని కళా వెంకట్రావు ఆరోపించారు. 

గుంటూరు: వైసీపీ ప్రభుత్వం తెలుగు భాషకు, తెలుగు సంసృతికి తూట్లు పొడిచేలా వ్యవహరిస్తోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కళా వెంకట్రావు మండిపడ్డారు. పక్కరాష్ట్రాలు మాతృభాషకు పెద్దపీట వేయడంలో పోటీ పడుతుంటే ఇక్కడ మాత్రం తెలుగు భాష పూర్తిగా నిర్లక్ష్యంలో కొట్టుమిట్టాడుతోందన్నారు. జగన్ ముఖ్కమంత్రి అయిననాటి నుంచి తెలుగు భాషను, తెలుగు అకాడమినీ నిర్లక్ష్యం చేస్తూ తెలుగుకు తెగులు పట్టిస్తున్నారని కళా ఆరోపించారు. 

''గతంలో ఎన్నడూ లేని విధంగా తెలుగు అకాడమిలో  పలు ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో ఉన్న తెలుగు అకాడమిలో నిధులు మాయమయ్యాయి. కార్వాన్‌లో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నకిలీ పత్రాలు సృష్టించి రూ.43 కోట్లు కాజేశారు. నకిలీ పత్రాలు సృష్టించి డబ్బులు కాజేశారంటే అకాడమి చైర్మన్లు, అధికారులు ఏం చేస్తున్నారు?'' అని నిలదీశారు.

''ఉమ్మడి రాష్ట్రం నుంచి ఉన్న తెలుగు అకాడమి నిధులు ఇప్పుడు కొట్టేయటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇన్నాళ్లు ఉన్న నిధులు ఇప్పుడే ఎందుకు మాయమయ్యాయి?  మాతృభాష నిధుల్లో అవినీతికి పాల్పడటమంటే ఆ భాష మాట్లాడుతున్న కోట్లాది మంది మనోభావాలకు, భావోద్వేగాలతో ఆడుకున్నట్లే. దీనిపై  పోలీసులు సమగ్ర విచారణ జరపాలి. నకిలీ పత్రాలు సృష్టించిందెవరో, అందుకు సహకరించిందెవరో తెలుగు అకాడమిలో రూ. 43 కోట్లు కొట్టేసిన దొంగలెగవరో తేలాలి'' అని కళా డిమాండ్ చేశారు. 

read more  తెలుగు అకాడమీలో రూ.43 కోట్ల నిధుల గోల్‌మాల్.. తెలంగాణ సర్కార్ సీరియస్, విచారణకు కమిటీ

''దేశ భాషల్లోనే కాకుండా ప్రపంచ భాషలలోనే అత్యంత ప్రాచీన భాషగా, ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్‌గా ప్రపంచ ప్రఖ్యాతి పొందిన మన తెలుగు భాష జగన్ ప్రభుత్వం వచ్చాకే నిర్లక్ష్యానికి గురవుతోంది. తెలుగు మీడియం రద్దు చేయాలని ప్రయత్నించారు, కానీ కోర్టులు మొట్టికాయలు వేయటంతో వెనక్కి తగ్గారు. తెలుగు భాష అభివృద్ధి, వినియోగం కోసం కృషి చేయాల్సిన అకాడమీ అస్తిత్వాన్ని దూరం చేసేలా ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న తెలుగు అకాడమిని తెలుగు-సంసృత అకామీగా పేరు మార్చారు. తెలుగు అకాడమీ పేరు మార్చడం జగన్ రెడ్డి భావ దారిద్య్రానికి నిదర్శనం'' అని మండిపడ్డారు.

''ప్రాచీన భాషగా తెలుగు వర్ధిల్లుతూ ఉంటే.. తెలుగు భాషను కించపరిచేలా ప్రభుత్వం వ్యవహరించడం తెలుగు ప్రజానీకానికి అవమానకరం. జగన్ రెడ్డికి తెలుగు భాష గౌరవం, తెలుగు విశ్వవిద్యాలయం గొప్పతనం తెలియకపోవడం తెలుగు ప్రజల దురదృష్టం. తెలుగులో జీవోలు ఇవ్వమంటే అసలు జీవోలే ప్రజలకు అందుబాటులో ఉండకుండా చేశారు. వైసీపీ ప్రభుత్వ వ్యవహారశైలిపై  ప్రతీ తెలుగువారు ఆత్మవిమర్శ చేసుకోవాలి. తెలుగు భాషా పరిరక్షణకోసం ప్రతీ తెలుగువాడు ఒక గిడుగు వారిలా నడుం బిగించాల్సిన సమయం ఆసన్నమయ్యింది'' అన్నారు కళా వెంకట్రవు.
         
 

PREV
click me!

Recommended Stories

Road Doctor: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోడ్డు డాక్ట‌ర్‌.. దేశం దృష్టిని ఆక‌ర్షిస్తోన్న స‌రికొత్త సేవ‌లు
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!