ప్రమాదంలో వున్నానని ఆనందయ్యే చెప్పారు... అందుకే సుప్రీంకోర్టుకు: కెఏ పాల్ సంచలనం

By Arun Kumar PFirst Published May 30, 2021, 9:10 AM IST
Highlights

తాను ప్రమాదంలో వున్నట్లు స్వయంగా ఆనందయ్యే తనకు చెప్పినట్లుకెఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

అమరావతి: కరోనాకు మందు అందిస్తున్న కృష్ణపట్నం ఆనందయ్య ప్రమాదంలో వున్నారని ప్రముఖ క్రైస్తవ మత ప్రబోధకుడు కేఏ పాల్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆనందయ్యే తనకు చెప్పినట్లు పాల్ తెలిపారు. అందువల్లే ఆనందయ్య మందు పంపిణీ వ్యవహారంపై సుప్రీంకోర్టుకు వెళ్లినట్లు పాల్ వెల్లడించారు. 

''ఆనందయ్య, సంపత్ రాజ్ లతో నేను మాట్లాడాను. తాము ప్రస్తుతం ప్రమాదంలో వున్నట్లు ఇద్దరూ చెప్పారు. భద్రత పేరుతో పోలీసులు తమను ఎటూ కదలనివ్వడం లేదన్నారు. వీరికి ఏదయినా అయితే ప్రభుత్వానిదే బాధ్యత. మన ఆరోగ్యం కోసం తాపత్రయపడుతున్న వారిని కాపాడుకోవడానికి అందరూ కలిసిరావాలి'' అని కెఏ పాల్ పిలుపునిచ్చారు. 

read more  ఇంటికి చేరుకున్న ఆనందయ్య.. మందు పంపిణీకి దక్కని అనుమతి

ఇప్పటికే కేఏ పాల్ కృష్ణపట్నం ఆనందయ్యకు మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే. శనివారం వీడియోలో మాట్లాడిన  ఆయన... ప్రైవేట్ ఆసుపత్రులు ఘోరంగా దోచుకుంటున్నాయని ఆరోపించారు.  ప్రైవేట్ ఆసుపత్రుల నిర్లక్ష్యం వల్లే తన తల్లి చనిపోయిందని పాల్ ఆవేదన వ్యక్తం చేశారు. కోవిడ్ ఉద్ధృతి కారణంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని, ఈ సమయంలో ఆనందయ్యను దేవుడు వరంగా ఇచ్చారని పాల్ ప్రశంసించారు.

ప్రకృతి సహజంగా లభించిన మూలికలతో మందులను తయారు చేస్తున్న ఆనందయ్యను కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఆనందయ్య ఉన్న చోటికి జాతీయ మీడియా వెళ్లి విచారణ జరపాలని పాల్ విజ్ఞప్తి చేశారు. ఆ మందుతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని సంస్థలే చెబుతున్నాయన్న పాల్..  ఆనందయ్యను విడుదల చేయాలని సీఎం జగన్, డీజీపీ, కేంద్ర హోంమంత్రి, హైకోర్టు సీజేఐ, సుప్రీం సీజేఐలను కోరాలని సూచించారు. 

 సరైన మందు లేని కరోనాపై పోరుకు ఆనందయ్య తమతో చేతులు కలపాలని కేఏ పాల్ కోరారు. ఆనందయ్యతో కలిసి తమ సంస్థ ఉచితంగా ట్రెయినింగ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్నారు. ఇందు కోసం వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేయించుకోవాలని... మందు తయారీకి కావలసిన మెటీరియల్స్ తెచ్చుకుంటే.. తయారు చేసుకుని వెళ్లొచ్చన్నారు. కావలసిన ఏర్పాట్లు చేస్తామని, ఉచితంగా శిక్షణ అందిస్తామని కేఏ పాల్ స్పష్టం చేశారు. సెక్యూరిటీ పేరుతో ఆయనను నిర్బంధించారని.. ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోవాలని పాల్ డిమాండ్ చేశారు. 

click me!