
విజయవాడ: తరతరాలుగా అనంతపురం జిల్లాను వేధిస్తున్న కరువును ప్రభుత్వం, ప్రపంచం దృష్టికి తీసుకెళ్లే విధంగా జనసేన పార్టీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా డిసెంబర్ 2న రాయలసీమ అనావృష్టి- కరువుపై జనసేన కవాతుకు పిలుపునిచ్చింది.
డిసెంబర్ 2న అనంతపురంలోని గుత్తి రోడ్డులోని మార్కెట్ యార్డు వద్ద నుంచి క్లాక్ టవర్ వరకు కవాతు కొనసాగనునుంది. సాయంత్రం 4 గంటలకు కవాతు ప్రారంభం కానున్నట్లు ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ చెప్పారు.
జనసేన కవాతు నేపథ్యంలో జనసేన పార్టీ ఓ వీడియోను విడుదల చేసింది. రాయలసీమలో కరవు పరిస్థితుల్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు, వలసలను తగ్గించడంలో సర్కారు వైఫల్యాన్ని ప్రశ్నించేందుకు ఈ కవాతు నిర్వహిస్తున్నట్లు పార్టీ నేత నాదెండ్ల మనోహర్ వీడియోలో వివరించారు. గుత్తి రోడ్డులోని మార్కెట్ యార్డు నుండి క్లాక్ టవర్ వరకు కవాతు నిర్వహించనున్నారు.
అంతరించిపోతున్న చేనేత కళకు ఆదరణ కల్పించడం, ఉపాధి లేక రోడ్డున పడుతున్న యువతకు అండగా నిలవడం లక్ష్యంగా జనసేన ఈ కవాతు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో పాల్గొనటం ద్వారా రాయలసీమ సమస్యలపై పోరాడుతున్న జనసేనకు మద్దతివ్వాలని ప్రజలను కోరారు.
లక్షలాదిగా తరలి వచ్చి ఈ కవాతును విజయవంతం చెయ్యాలని పిలుపునిచ్చారు. గతంలో తూర్పుగోదావరి జిల్లాలో నిర్వహించిన జనసేన కవాతు విజయవంతం కావడంతో అదే రీతిలో అనంతపురం కవాతు కూడా విజయవంతం చేసేందుకు పార్టీ కార్యకర్తలు అభిమానులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.