వైసీపీలో పాలనలో రెడ్లను కూడా అణచేస్తున్నారు... అన్నింటికీ తెగించా, దేనికైనా ‘‘సై’’ : పవన్ కల్యాణ్

By Siva KodatiFirst Published Oct 2, 2021, 2:55 PM IST
Highlights

పోలీసులు కార్యకర్తలను అడ్డుకోవడం సరికాదన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో శనివారం జరిగిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. ప్రజల హక్కులను ఏ ప్రభుత్వం  ఆపలేదని పవన్ స్పష్టం చేశారు. నిరసన తెలపడం రాజ్యాంగం కల్పించిన హక్కని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. 

పోలీసులు కార్యకర్తలను అడ్డుకోవడం సరికాదన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో శనివారం జరిగిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. ప్రజల హక్కులను ఏ ప్రభుత్వం  ఆపలేదని పవన్ స్పష్టం చేశారు. నిరసన తెలపడం రాజ్యాంగం కల్పించిన హక్కని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. రాజ్యాంగ హక్కులను కాలరాయొద్దని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. రాజకీయం అనేది కష్టమైన ప్రక్రియ అని.. రాజకీయం నాకు సరదా కాదు, బాధ్యత అని పవన్ స్పష్టం చేశారు. తనను తిడితే భయపడతానని అనుకుంటున్నారా అని ఆయన ప్రశ్నించారు. బూతులు తిడితే తొక్కిపెట్టి నార తీస్తానని పవన్ హెచ్చరించారు. కులాల పేరిట రాజకీయాలు చేస్తున్నారని.. గుంతలు లేని రోడ్డు రాష్ట్రంలో ఒక్కటైన వుందా అని ఆయన ప్రశ్నించారు. 

కమ్మ సామాజిక వర్గాన్ని వర్గశత్రువుగా ప్రకటించారు:

రోడ్ల విషయంలో సజ్జల వ్యాఖ్యలు సరికాదని పవన్ పేర్కొన్నారు. రాష్ట్ర పెత్తనమంతా కేవలం రెండు ఇళ్ళ మధ్య జరుగుతుందంటే కుదరదన్నారు. ఇన్ని కులాలను అడ్డం పెట్టుకుని మీకు బిచ్చం వేస్తామంటే కుదరదని పవన్ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ఒక కులాన్ని వర్గ శత్రువుగా ప్రకటించడం జరిగే పనికాదని ఆయన అన్నారు. వైసీపీ నేతలు కమ్మ సామాజిక వర్గాన్ని వర్గ శత్రువుగా ప్రకటించి రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారని పవన్ మండిపడ్డారు. 2005 నుంచి తనపై దాడి చేయడం మొదలుపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. నా ప్రాణాలు వదిలేసి ప్రజల కోసం అడ్డంగా నిలబడేందుకే ఆ రోజున తుపాకీ ఇచ్చేశానని పవన్ చెప్పారు. వైసీపీ పాలనలో ఎవరికీ మాట్లాడే పరిస్ధితి లేదని.. నోరు తెరిస్తే కొడతారని , లేదంటే జైళ్లో పెడతారని జనసేనాని మండిపడ్డారు. కడప జిల్లాలో నలుగురు బీజేపీ కార్యకర్తలను వైసీపీ నేతలు హత్య చేశారని ఆయన ఆరోపించారు. ఇక జనసేన కార్యకర్తలపై జరిగే దాడులకు అంతేలేదని పవన్ అన్నారు. 

అన్నింటికీ తెగించే వచ్చా:


తాను దేనికి సై అంటే దానికి సై అని హెచ్చరించారు. ప్రజాస్వామ్య పద్ధతి అయినా  పర్లేదని.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునే రకం కాదని జనసేనాని అన్నారు. అన్నింటికి తెగించే వచ్చానని పవన్ హెచ్చరించారు. తాడేపల్లిలో వున్న సీఎం జగన్‌ను మట్టిలో నడిచి రోడ్లు ఎలా వున్నాయో చూడమని చెప్పాలంటూ సజ్జలకు హితవు పలికారు పవన్ . పోలీసులకు , అధికారులకు ఫోన్ చేసి సజ్జల రామకృష్ణారెడ్డి తన కార్యక్రమాన్ని అడ్డుకోవాలని చూశారని జనసేనాని ఆరోపించారు. తేలుకు పెత్తనమిస్తే అందరినీ కుల్లబోడిచినట్లు.. వైసీపీ అన్ని కులాలను కుల్లబోడుస్తోందని పవన్ మండిపడ్డారు. రెడ్డి సామాజిక వర్గంలో కూడా వైసీపీ పాలనపై ఎంతో బాధ వుందని ఆయన అన్నారు. 

లక్ష మందితో ధవళేశ్వరం సభ జరగాల్సింది:

వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై వైసీపీ నేతల్లో ఒక్కరు కూడా మాట్లాడరా... కోడికత్తి నేరస్తుడిని  ఎందుకు పట్టుకోలేదని పవన్ ప్రశ్నించారు. ఐఏఎస్, ఐపీఎస్‌‌లు నేరచరిత్ర వున్న నేతలకు సెల్యూట్ చేయడం ఏంటన్నారు. అధికార యంత్రాంగం వాళ్ల పని వారు చేయకుంటే తాము రోడ్ల మీదకు రావాల్సి వచ్చిందన్నారు. లక్ష మందితో ధవళేశ్వరంలో జరగాల్సిన కార్యక్రమాన్ని ప్రభుత్వం అడ్డుకుందని.. 4 వేల పైచిలుకు వాహానాలను ఆపివేశారని, దీనిని బట్టి జనసేన అంటే ఎంత భయం వుందో అర్ధం చేసుకోవచ్చని పవన్ అన్నారు. 2024లో జనసేన విజయం తథ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 

కోపాన్ని సీమ వాళ్లలాగా దాచుకోండి:

రాజకీయ చదరంగంలో జనసేన ఒక చిన్న పావు అని పవన్ చెప్పారు. మార్పు కోసం తాము తపిస్తున్నామని... వచ్చే ఎన్నికల్లో జనసేన విజయకేతనం ఎగరవేయబోతోందని ఆయన పేర్కొన్నారు. రాజకీయాల నుంచి పారిపోయే ప్రసక్తి లేదని.. కోపాన్ని తారాజువ్వల్లా వదిలేయొద్దని పవన్ విజ్ఞప్తి చేశారు.  గోదావరి జిల్లా ప్రజలు కోపాన్ని దాచుకునే కళను అభ్యసించాలని.. అందుకోసం రాయలసీమకు ట్రైనింగ్‌కు పంపుతానని పవన్ చెప్పారు. సీమలో కోపాన్ని మూడ తరాల పాటు దాచుకుంటారని ఆయన గుర్తుచేశారు. సీఎం అయ్యాకే తనను సీఎం అని పిలవాలని అభిమానులకు ఆయన విజ్ఞప్తి చేశారు. అగ్నిపర్వతం గర్భంలో లావా తరహాలో కోపాన్ని దాచుకోవాలని పవన్ సూచించారు. తాను కోరుకుంటున్నది సామాజిక మార్పు అని పదవులు కాదని ఆయన స్పష్టం చేశారు. నా దేవుడి గదిలో రష్యా సెయింట్ ఫోటో ఉంటుందని పవన్ పేర్కొన్నారు. 

click me!