తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో సెల్స్ గర్ల్ పై జరిగిన సామూహిక అత్యాచారం ఘటనపై జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ స్పందించారు.
రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో సెల్స్ గర్ల్ పై జరిగిన సామూహిక అత్యాచారం ఘటనపై జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ స్పందించారు. మహిళల భద్రత కోసం తీసుకువచ్చిన దిశ చట్టంలో భాగంగా మొదటి దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటయిన రాజమండ్రిలో ఈ ఘటన చోటుచేసుకోవడం దారుణమన్నారు. ఇక్కడే పరిస్థితి ఇలా వుంటే అసలు మహిళా పోలీస్టేషన్లు లేని ప్రాంతాల్లో పరిస్థితి మరెంత దారుణంగా వుందోనని పవన్ ఆందోళన వ్యక్తం చేశారు.
''రాజమహేంద్రవరంలో కుటుంబ పోషణ కోసం ఓ దుకాణంలో పని చేస్తున్న 16ఏళ్ల బాలికపై కొందరు కామాంధులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారనే వార్త తీవ్రంగా కలచివేసింది. అమానుషకరమైన ఈ ఘటన హృదయం ఉన్న ప్రతి ఒక్కరినీ కదిలిస్తుంది. నాలుగు రోజులపాటు చిత్ర హింసలకు గురి చేసిన ఆ మృగాళ్లను కఠినంగా శిక్షించాలి'' అని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.
read more కరోనా చేయించిన హత్య... కన్నతల్లిని గొంతుకోసి చంపిన కసాయి కొడుకు
''తన కుమార్తె ఆచూకీ తెలియడం లేదని తల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సకాలంలో స్పందించలేదని తెలిసింది. మహిళలపై అత్యాచారాలు నిరోధానికి తీసుకువచ్చిన దిశ చట్టం ఏమైపోయింది? అసెంబ్లీలో ముక్తకంఠంతో ఆమోదం పొందిన ఆ చట్టం ఇంకా ఎందుకు అమలు కావడం లేదు? తొలి దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటైన రాజమహేంద్రవరంలోనే సామూహిక అత్యాచార ఘటన చోటు చేసుకొంది. దిశ పేరుతో ఏర్పాటైన ఆ ప్రత్యేక పోలీస్ స్టేషన్లు ఏం చేస్తున్నాయి'' అని నిలదీశారు.
''ఈ సామూహిక అత్యాచారం వెనక గంజాయి, డ్రగ్స్ ముఠాలు ఉన్నాయనీ ఇది బ్లేడ్ బ్యాచ్ పనే అని ఆ నగరవాసులు ఆందోళన చెందుతున్న విషయాన్ని పోలీస్ అధికారులు పరిగణనలోకి తీసుకోవాలి. అలాంటి ముఠాల ఆగడాలకు కళ్ళెం వేయకపోతే రక్షణ కరవవుతుంది. చట్టం చేయడం కాదు.. వాటిని నిబద్ధతతో అమలు చేస్తేనే మహిళలకు రక్షణ కలుగుతుంది'' అంటూ పవన్ కల్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు.