స్వచ్ఛ సంకల్పం ప్రారంభించిన వైఎస్ జగన్..!

By telugu news teamFirst Published Oct 2, 2021, 3:24 PM IST
Highlights

గాంధీ జయంతి సందర్భంగా శనివారం విజయవాడ బెంజి సర్కిల్‌ దగ్గర 4,097 చెత్త వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. గ్రామీణ, పట్టణ, నగర ప్రజలకు మెరుగైన పారిశుధ్య సేవలు అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో సరికొత్త పథకాన్ని ప్రారంభించారు. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఆయన జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని ప్రారభించడం విశేషం. 

గాంధీ జయంతి సందర్భంగా శనివారం విజయవాడ బెంజి సర్కిల్‌ దగ్గర 4,097 చెత్త వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. గ్రామీణ, పట్టణ, నగర ప్రజలకు మెరుగైన పారిశుధ్య సేవలు అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. బిన్‌ ఫ్రీ, లిటర్‌ ఫ్రీ, గార్బేజ్‌ ఫ్రీ రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దే జాతీయస్థాయి స్వచ్ఛ సర్వేక్షణ్‌ పోటీల్లో ఉత్తమ ర్యాంక్‌ సాధించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 100 రోజులపాటు జగనన్న స్వచ్ఛ సంకల్పం కొనసాగనుంది.

ఇళ్లలో తడి, పొడి, ప్రమాదకర చెత్తను వేరు చేసేలా ప్రతి ఇంటికి మూడు డస్ట్‌ బిన్‌ల చొప్పున క్లాప్‌ కార్యక్రమంలో భాగంగా మునిసిపాలిటీల్లో ప్రభుత్వం పంపిణీ చేయనుంది. 123 కార్పొరేషన్‌లు, మునిసిపాలిటీల్లోని 40 లక్షల గృహాలకు 1.20 కోట్ల డస్ట్‌ బిన్‌లు పంపిణీ చేస్తారు. ప్రభుత్వం రూ.100 కోట్ల నిధులను కేటాయించింది. జన సంచారం అధికంగా ఉన్న ప్రాంతాలలో 1,500 పబ్లిక్‌ టాయిలెట్లు నిర్మించనున్నారు. చెత్త సేకరణ, తరలింపు కోసం 3,097 ఆటో టిప్పర్లు, 1,771 ఎలక్ట్రిక్‌ ఆటోలు కూడా ఏర్పాటు చేశారు.

ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను 5,868 జీపీఎస్‌ ఆధారిత గార్బేజ్‌ టిప్పర్ల ద్వారా గార్బేజ్‌ ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్‌లకు తరలిస్తారు. 124 మునిసిపాలిటీలలో 231 గార్బేజ్‌ ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్‌‌లు ఏర్పాటు చేయడంతో పాటు 72 మునిసిపాలిటీలలో ఇంటిగ్రేటెడ్‌ సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్రాజెక్టుల కోసం ఏజెన్సీల ఖరారుకు ఇప్పటికే టెండర్లు పిలిచారు. ఇటు చెత్త రవాణా కోసం గ్రామ పంచాయతీలకు 14 వేల త్రిచక్ర వాహనాలు పంపిణీ చేస్తారు. చెత్త సేకరణ–రవాణాను మరింత మెరుగుపరిచేందుకు వెయ్యి ఆటోలు సమకూరుస్తారు.

click me!