2024 ఎన్నకలకు రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేస్తామంటూ వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా జగన్ అనంతపురం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఆదివారం ధర్మవరం నియోజకవర్గంలో జరిగిన ఓ సమావేశంలో జనాలను ఉద్దేశించి మాట్లాడుతూ, 2019 ఎన్నికల్లో వైసిపి అధికారంలోకి వస్తే మూడు దశల్లో మద్యాన్ని నిషేధిస్తామని చెప్పారు. నిషేధం కూడా మూడు దశల్లో అమలు చేస్తామని చెప్పారు.
మొదటి దశలో మద్యానికి బానిసలైన వారిని మద్యం తాగించటాన్ని మాన్పించేందుకు ప్రతీ నియోజకవర్గంలోనూ ఓ డి-అడిక్షన్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే, మధ్య తరగతి వాళ్ళకు అందుబాటులో లేని స్ధాయిలో మద్యం ధరలను బారీగా పెంచేస్తామన్నారు. ఇక, మూడో స్ధాయిలో సంపూర్ణ మద్య నిషేధాన్ని తీసుకొస్తానని చెప్పారు. రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం అమలు చేసిన తర్వాతే 2024 ఎన్నికల్లో మళ్ళీ ఓట్లు అడగటానికి వస్తానని ప్రకటించారు.
జగన్ ప్రకటన వినడానికి బాగానే ఉంది కానీ అమలయ్యేందుకు అవకాశాలు ఎంత అన్నదే ప్రశ్న. ఎందుకంటే, సంపూర్ణ మద్య నిషేధం అన్నది దాదపు అసాధ్యమని తేలిపోయింది. ప్రతీ ప్రభుత్వానికి మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయమే చాలా కీలకమైపోయింది. ఇపుడు కూడా ప్రతీ ఏడాది సుమారు రూ. 16 వేల కోట్లు మద్యం ద్వారా ఆదాయం సమకూరుతోంది. బహుశా 2019 ఎన్నికల నాటికి ఆదాయం రూ. 20 వేల కోట్లకు చేరుకున్నా ఆశ్చర్యం లేదు.
పైగా పొరుగునే ఉన్న తమిళనాడు, కర్నాటక, తెలంగాణా, ఒడిష్షా, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో మద్యంపై నిషేధం లేనపుడు ఒక్క ఏపిలో మాత్రమే సంపూర్ణ మద్య నిషేధం అంటే చెప్పినంత సులువు కాదు అమలు చేయటం. నిషేథం సమయంలో జరగబోయేదేంటంటే తాగేవాళ్ళు ఇప్పటికన్నా బాగా ఎక్కువ ధరలు పెట్టి కొనటం, కేసుల పేరుతో పోలీసులు మద్యం తాగే వాళ్ళని బాదేయటం లాంటివి తప్ప ఇంకేమీ జరగదన్నది చరిత్ర చెప్పిన సత్యం.