నంద్యాల: గోస్పాడే కీలకం.. రెండంచెల వ్యూహంతో జగన్

Published : Aug 10, 2017, 06:31 AM ISTUpdated : Mar 26, 2018, 12:00 AM IST
నంద్యాల: గోస్పాడే కీలకం.. రెండంచెల వ్యూహంతో జగన్

సారాంశం

శిల్పా మోహన్ రెడ్డి గెలుపే లక్ష్యంతో బరిలోకి దిగిన వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గోస్పాడు మండలంపైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. ఇక్కడ ఎవరైతే ఆధిక్యత సాధిస్తారో వారిదే విజయమని రెండు పార్టీలు భావిస్తున్నాయి. అందుకే ఇటు జగన్ అయినా అటు టిడిపి అయినా గోస్పాడు మీదే బాగా దృష్టి పెట్టాయి. ఇదివరకు జగన్  చేయించుకున్న సర్వేలో కూడా గోస్పాడు మండలమే కీలకమని తేలిందట.

శిల్పా మోహన్ రెడ్డి గెలుపే లక్ష్యంతో బరిలోకి దిగిన వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గోస్పాడు మండలంపైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. నియోజకవర్గంలో 2.30 లక్షల ఓట్లున్నాయి. ఇందులో మున్సిపాలిటీ పరిధిలో సుమారు 1.2 లక్షల ఓట్లుండగా, మిగిలిన ఓట్లు గోస్పాడు, నంద్యాల రూరల్ మండలాల్లో ఉన్నాయి. మున్సిపాలిటీ, నంద్యాల మండలాల్లో టిడిపి, వైసీపీలకు కాస్త అటు ఇటుగా బలముంటుంది. అంటే, పోయిన ఎన్నికల్లో వచ్చిన ఓట్ల ఆధారంగా రేపటి ఎన్నికల్లో కూడా అదే విధంగా ఉండవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే, పొయిన ఎన్నికల్లో పోలైనవి 1.75 లక్షల ఓట్లే.

ఇటువంటి పరిస్ధితిలో గోస్పాడు మండలమే చాలా కీలకంగా మారింది. ఇక్కడ ఎవరైతే ఆధిక్యత సాధిస్తారో వారిదే. అందుకే ఇటు జగన్ అయినా అటు టిడిపి అయినా గోస్పాడు మీదే బాగా దృష్టి పెట్టాయి. ఇందులో భాగంగానే జగన్ బుధవారం తన రోడ్డు షోను గోస్పాడు మండలంలో నిర్వహించారు. ఇదివరకు జగన్  చేయించుకున్న సర్వేలో కూడా గోస్పాడు మండలమే కీలకమని తేలిందట. దానికి తగ్గట్లే శిల్పా సోదరులు కూడా మండలంలోని అన్నీ గ్రామాలు టచ్ అయ్యేట్లుగా రోడ్‌ మ్యాప్ సిద్ధం చేశారు. ప్రతీ గ్రామంల్లోనూ జగన్ ప్రచారం ఉండేట్టు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఈ మండలానికి ప్రస్తుతం టిడిపి తరపున మంత్రి ఆదినారాయణరెడ్డి ఇన్ఛార్జిగా ఉన్నారు. వైసీపీ తరపున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గంగుల ప్రభాకర్ రెడ్డి, పిపి నాగిరెడ్డి వ్యవహరిస్తున్నారు. వీరిలో మొదటి ఇద్దరికన్నా పిపి నాగిరెడ్డే కీలకం. ఎందుకంటే, జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ కూడా అయిన నాగిరెడ్డిది ఈ మండలమే. పిపికి మండలంలో బాగా పట్టుంది. అందుకనే నాగిరెడ్డిని పార్టీలోకి లాక్కోవాలని టిడిపి ఎంతగానో ప్రయత్నించింది. అయినా సాధ్యం కాలేదు.

ఈ మండలంలోని 15 గ్రామాల్లోని 28 వేల ఓట్లలో వైసీపీ అభ్యర్థి భూమాకు 750 ఓట్ల మెజార్టీ వచ్చింది. శోభా నాగిరెడ్డి మృతి తాలూకు సానుభూతి బాగా పనిచేసింది. అయితే, తర్వాత పరిస్ధితిల్లో భూమా పార్టీ మారినా క్యాడర్ మాత్రం వైసీపీలోనే ఉంది. ప్రస్తుతానికి వస్తే మండలంలో ప్రధానమైన యాలూరు, దీబగుంట్ల, జిల్లెల, గోస్పాడు గ్రామాల ఓట్లు టిడిపికి పడకూడదన్న పట్టుదలతో నాగిరెడ్డి ఉన్నారు. ఇక్కడే జగన్ రెండంచెల వ్యూహంతో ముందుకు వెళుతున్నారు. గోస్పాడు మండలంలో పరిస్ధితిని మరింత మెరుగు పరుచుకోవటంతో పాటు నంద్యాల రూరల్, పట్టణంలో కూడా మెజారిటీ సాధించాలన్న లక్ష్యంతోనే జగన్ రెండు వారాల క్యాంపు పెట్టుకున్నారు.  మరి, చంద్రబాబునాయుడు ఏం చేస్తారో చూడాలి?

PREV
click me!

Recommended Stories

Vijay Saireddy New Twist On YS Jagan | Vijaysaireddy Press Meet Today | Asianet News Telugu
ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్న Sai Reddy | Vijay Saireddy Press Meet | Asianet News Telugu