2019లో గెలుపుకు టిడిపి అడ్డదారులివేనా?

First Published Feb 10, 2018, 11:49 AM IST
Highlights
  • వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు జన స్పందన చూసిన తర్వాత టిడిపిలో టెన్షన్ పట్టుకున్నట్లుంది.

 అందరూ అనుమానిస్తున్నట్లుగానే వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు టిడిపి అడ్డదారులు తొక్కుతోంది. వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు జన స్పందన చూసిన తర్వాత టిడిపిలో టెన్షన్ పట్టుకున్నట్లుంది. ప్రభుత్వంపై జనాల్లో 80 శాతం సంతృప్తి ఉందని చంద్రబాబునాయుడు చాలాసార్లు చెప్పారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా రాష్ట్రంలోని 175 సీట్లూ టిడిపివే అంటూ ఒకటికి పదిసార్లు నేతల సమావేశాల్లో ఢంకా బజాయించారు. అయితే, క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే చంద్రబాబు చెప్పినవన్నీ కేవలం కబుర్లే అని తేలిపోతోంది.

జగన్ పాదయాత్ర మొదలైన దగ్గర నుండి జనాల్లో అనూహ్య స్పందన వస్తోంది.

సొంత జిల్లా కాబట్టి కడపలో ఏదోలే జనాలు వచ్చారనుకున్నారు. కానీ రాయలసీమలోనే కాకుండా ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో కూడా ప్రజలు విపరీతంగా స్పందిస్తున్నారు. దాంతో టిడిపిలో ఆందోళన మొదలైనట్లుంది. అందుకే వచ్చే ఎన్నికల వరకూ ఆగకుండా ఇపుడే అడ్డదారులు తొక్కుతోంది.  ఇంతకీ టిడిపి చేస్తోందేమిటంటే, ఓటర్ల జాబితా నుండి ఓట్లను తొలగించటం, పోలింగ్ బూత్ లను మార్చేయటం.

రాష్ట్రంలోని అన్నీ నియోజకవర్గాల్లోనూ వైసిపి మద్దతుదారుల ఓట్లు అన్నఅనుమానం వస్తే చాలా ఓటర్ల జాబితా నుండి పేర్లను తొలగిస్తున్నారు. ఇప్పటికీ ప్రతీ నియోజకవర్గం నుండి వేలాది ఓట్లను అధికారులు తొలగించేశారు. గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి మున్సిపాలిటిలోనే సుమారు 10 వేల ఓట్లను తొలగించారు. ఇది స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు సొంత నియోజకవర్గం. చిలకలూరిపేటలో 9 వేలు, నరసరావుపేటలో 20 వేల ఓట్లను అధికారులు తొలగించారు.

బయటపడిన పై నియోజకవర్గాల్లోనే కాకుండా గుంటూరు, కర్నూలు, విశాఖపట్నం, నెల్లూరు, కడప, కర్నూలు లాంటి చాలా నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ఓట్లు గల్లంతయ్యాయి. విచిత్రమేమిటంటే గల్లంతైన ఓట్లన్ని కూడా వైసిపికి మద్దతుదారులవే అన్న ఆరోపణలు వినబడుతున్నాయి. అందుకనే వైసిపి నేతలు మాత్రమే గగ్గొలు పెడుతున్నారు. అదే విషయాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమీషనర్ ఆర్పీ సిసోడియాను కలిసి వైసిపి నేతలు ఫిర్యాదు చేశారు. వచ్చే ఎన్నికల్లో గెలుపుపై నమ్మకం లేకనే టిడిపి అడ్డదారులు తొక్కుతోందంటూ వైసిపి నేతలు మండిపోతున్నారు.

click me!