
వైసీపీ ఎంఎల్ఏలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలపై చంద్రబాబునాయుడు సర్వే నిర్వహిస్తున్నారా? పార్టీవర్గాలు అవుననే అంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఒక్కసీటు కూడా రాకూడదన్నది చంద్రబాబు ఆలోచన. సరే, మనది ప్రజాస్వామ్యదేశం కాబట్టి చంద్రబాబు అనుకున్నట్లుగా జరిగే అవకాశం లేదనకోండి. కానీ ఆ కోరిక మాత్రం చంద్రబాబులో బలంగా ఉంది. ఆ విషయం గ్రహించారు కాబట్టే మంత్రులు, నేతలు కూడా అదే విషయాన్ని పదే పదే చెబుతుంటారు. వారికదో ఆనందం లేండి. ఇంతకీ చంద్రబాబు ఏం చేస్తున్నారు?
వైసీపీ ఎంఎల్ఏలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ఆ ఎంఎల్ఏల పనితీరు ఎలాగుందనే విషయమై సర్వే జరిపిస్తున్నారట. వైసీపీ ఎంఎల్ఏల పనితీరు, వారి బలాలు, బలహీనతలు అన్నింటినీ క్షుణ్ణంగా అధ్యయనం చేయిస్తున్నారట. ఎందుకంటే, వచ్చే ఎన్నికలు ఎంతో దూరంలో లేవుకదా? మరి, టిడిపి తరపున పోటీలోకి దింపాల్సిన గట్టి నేతలెవరో తేల్చుకోవాలంటే ముందు వైసీపీ ఎంఎల్ఏల గురించి అధ్యయనం చేయాలని అనుకున్నారట. అందుకనే, వారి పనితీరుపై నిఘా వేసారు. ఇంటెలిజెన్స్ అధికారులు అదే పనిపైన బిజీగా ఉన్నారట.
వచ్చే ఎన్నికల్లోగా వైసీపీ నుండి టిడిపిలోకి వచ్చే వారెవరైనా ఉంటే వాళ్ళకు రెడ్ కార్పెట్ పరిచేందుకు కూడా చంద్రబాబు సిద్దంగా ఉన్నారు. అందుకు వీలుగానే సొంతజిల్లాలోని మదనపల్లె, పీలేరు లాంటి పలు నియోజకవర్గాల్లో ఇన్ఛార్జ్ లను పెట్టలేదు. ఒకవేళ సాద్యం కాకపోతే మెల్లిగా టిడిపి నేతలనే సిద్దం చేసుకుంటారు. వీలైనంతలో వైసీపీ ఎంఎల్ఏలను బలహీనం చేయాలన్నది అధికారపార్టీ వ్యూహంగా కనబడుతోంది.
వచ్చే ఎన్నికల్లోగా వీలైనంతమందిని దెబ్బ కొట్టగలిగితే టిడిపి ఈజీగా మళ్ళీ విజయం సాధించవచ్చన్నది అధినేత ఆలోచనగా కనబడుతోంది. కోస్తా, ఉత్తరాధ్ర జిల్లాల్లో ఎటూ టిడిపి బలంగానే ఉంది అన్న ఉద్దేశ్యంతో ప్రధానంగా రాయలసీమ ప్రాంతంపైనే చంద్రబాబు దృష్టి పెట్టారట. ఎందుకంటే, పోయిన ఎన్నికల్లో వైసీపీ గెలిచిన ఎంఎల్ఏల్లో రాయలసీమ నుండే ఎక్కువున్నాయి.