ఒకనాటి అందాల తార, ఒకప్పటి టిడిపి మహిళా అధ్యక్షురాలు జయప్రదకు మళ్ళీ రాష్ట్ర రాజకీయాలపై మనస్సు మళ్ళినట్లుంది. వచ్చే ఎన్నికల్లో ఏపి నుండి పోటీ చేయాలని ఉబలాట పడుతున్నారు. తెలుగుదేశంపార్టీలో చేరేందుకు దాదాపు అవకాశాలు లేవు. అందుకనే వైసీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఆమధ్య జనసేనలో చేరుతుందని ప్రచారం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే సరైన పార్టీ నిర్మాణమే లేని జనసేనలో చేరితో ఇబ్బందులొస్తాయని ఆలోచించినట్లు అందుకనే వైసీపీ వైపు అడుగులు వేస్తోందని ప్రచారం మొదలైంది.
ఒకపుడు టిడిపి తరపున రాజ్యసభ సభ్యురాలిగా జయప్రద పనిచేసారు. అయితే చంద్రబాబునాయుడు దెబ్బకు టిడిపినే కాదు చివరకు రాష్ట్రాన్ని కూడా వదిలేసారు. చాలాకాలం ఉత్తరప్రదేశ్ లో అమర్ సింగ్ ప్రాపకంతో సమాజ్ వాదీ పార్టీలో చక్రం తిప్పారు.
అయితే తర్వాత అమర్ సింగ్ ప్రాభవం క్షీణించటంతో జయప్రదకు కూడా కష్టాలు తప్పలేదు. దాంతో అప్పట్లో ఉత్తర్ ప్రదేశ్ లో ఎవరికీ పట్టకుండా పోయారు చాలాకాలం. చివరకు అమర్ సింగ్ పప్పులుడకటం లేదని భావించటంతో సొంత రాష్ట్రమైన ఏపి వైపే చూస్తున్నారు.
త్వరలో మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ అవ్వాలనుకుంటున్న జయప్రద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో సంప్రదింపులు మొదలుపెట్టినట్లు సమాచారం. రాజమండ్రి లోక్ సభలో పోటీ చేయటానికి కానీ లేదా రాజ్యసభకు వెళ్ళటానికి కానీ మొగ్గుచూపుతున్నారట. చర్చలు సఫలమైతే త్వరలోనే అందాల తార వైకాపా తీర్థం పుచ్చుకోవచ్చని వైసీపీ వర్గాలు చెబుతున్నాయ్.
రోజా రూపంలో ఇప్పటికే ఒక సినీ నటి పార్టీలో ఉన్నప్పటికీ.. మరింత సినీ గ్లామర్ కోసం వైకాపా కూడా ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో జయప్రదను ఆ పార్టీ చేర్చుకునే అవకాశాలున్నాయని సమాచారం.