ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సోమవారం సాయంత్రం భేటీ అయ్యారు. సుమారు 40 నిమిషాలపాటు వీరిద్దరూ మాట్లాడుకున్నారు. సీబీఐ కోర్టు తీర్పు పరిణామాలు, పాదయాత్ర తదితరాలపై రామోజీతో జగన్ చర్చించినట్లు సమాచారం. జగన్ వెంట భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఉన్నారు. ఇదిలా ఉండగా నవంబర్ 2 నుంచి తలపెట్టిన పాదయాత్రకు ఆశీస్సులు తీసుకునేందుకు రామోజీరావును జగన్ కలిసినట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
అవకాశం వచ్చినప్పుడల్లా జగన్, రామోజీరావులు కలుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. తన తండ్రి వైఎస్సాఆర్-రామోజిల మధ్య ఉన్న వైరాన్ని జగన్ వ్యూహాత్మకంగా తగ్గిస్తున్నారు. అందుకే అవసరమైనపుడు, అవకాశం వచ్చినప్పుడల్లా రామోజి ఫిల్మ్ సిటీకో లేక బయటెక్కోడో కలుస్తూనే ఉన్నారు. అదే టిడిపి వర్గాలకు రుచించటం లేదు.