55చోరీల అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్.. విమానాల్లో వెళ్లి మరీ దొంగతనాలు.. ఆ సిస్టమ్ తో అడ్డంగా దొరికిపోయాడు..

By SumaBala BukkaFirst Published Jun 15, 2022, 11:13 AM IST
Highlights

ఇంటికి పెట్టుకున్న లాక్డ్ హౌజ్ మానిటరింగ్ సిస్టం ఓ అంతరాష్ట్ర ఘరానా దొంగను పోలీసులకు పట్టించింది. అతను చేసిన దొంగతనాలు తెలిసి పోలీసులు షాక్ అయ్యారు. 
 

తిరుపతి : పేరు మేకల వంశీధర్ రెడ్డి… చదివింది ఐదో తరగతి..  వృత్తి దొంగతనాలు చేయడం.. ఇప్పటివరకు చేసిన  చోరీలు 55… ఇంకా బయటపడనివి ఎన్ని ఉన్నాయో తెలీదు. దేశ రాజధాని ఢిల్లీతో పాటు చాలా రాష్ట్రాల్లో చోరీలు చేసిన చరిత్ర అతనికి ఉంది. దొంగతనాల నిమిత్తం ఒక ప్రదేశం నుంచి మరో చోటికి వెళ్ళడానికి విమానాల్లో తిరుగుతుంటాడు. సెకండ్ షో సినిమాకి వెళ్లి వస్తూ తాళం వేసి ఉన్న ఇళ్లల్లోకి చొరబడి నిమిషాల్లో చోరీ చేయడం అతని ప్రత్యేకత. ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం తిరుపతికి వచ్చీ రాగానే చోరీలు ప్రారంభించిన వంశీధర్ ను లాక్డ్ హౌజ్ మానిటరింగ్ సిస్టం (ఎల్ హెచ్ఎంఎస్) పట్టించింది.  ఈనెల 10వ తేదీ రాత్రి సెకండ్ షో తర్వాత గోపాలరాజు కాలనీలో తాళం వేసున్న మంజునాథ శర్మ ఇంటి తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డాడు.

ఇంట్లో విలువైనవేవీ కనిపించకపోవడంతో అదే ప్రాంతంలో మురళి ఇంట్లోకి ప్రవేశించాడు. అయితే మురళి కుటుంబం విజయవాడకు వెళుతూ ఎల్‌హెచ్‌ఎంఎస్‌ కెమెరా పెట్టించుకుని వెళ్లడంతో కదలికలను దొంగ కదలికలను పోలీసులు సులువుగా గుర్తించారు. ఎల్‌హెచ్‌ఎంఎస్‌ కెమెరా తీసిన వీడియో ఫుటేజీ ఆధారంగా దొంగ రూపురేఖలు గుర్తించిన పోలీసులు సాంకేతికత సహాయంతో దొంగ కదలికలపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం తిరుపతిలోని డి.ఆర్ మహల్ రోడ్ లో టీటీడీ సత్రాల వద్ద తచ్చాడుతున్న వంశీధర్ ను గుర్తించి పట్టుకున్నారు. 

అధికారులకు చుక్కలు చూపిస్తున్న పులి: టైగర్ కోసం కాకినాడ జిల్లాలో కొనసాగుతున్న వేట

విచారణలో తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా, జ్యోతినగర్ కాలనీ కర్మన్ ఘాట్ కు చెందిన వెంకటరెడ్డి కుమారుడు వంశీధర్ గా గుర్తించారు. చిన్ననాటి నుంచే దొంగతనాలకు అలవాటు పడిన వంశీధర్ నెలరోజుల క్రితం భవాని నగర్ లోని సబ్ పోస్ట్ ఆఫీస్ వీధిలోని ఓ ఇంట్లో చోరీకి పాల్పడింది కూడా తానేనని అంగీకరించినట్లు డీఎస్పీ వెల్లడించారు. అంతర్రాష్ట్ర గజదొంగలను పట్టుకున్నందుకు గానూ డీఎస్పీ, సీఐ, ఎస్ఐలు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

అంతర్ జిల్లా దొంగ అరెస్ట్.. 50 గ్రాముల బంగారం స్వాధీనం..
రాష్ట్రంలోని పలు జిల్లాలలో చోరీలకు పాల్పడుతున్న తిరుపతికి చెందిన ఘరానా దొంగను.. తిరుపతి ఈస్ట్ పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం పోలీస్ స్టేషన్లో విలేకరులతో మాట్లాడుతూ డిఎస్పీ మురళీకృష్ణ వివరాలను వెల్లడించారు. తిరుపతి ఆటో నగర్ కు చెందిన రమేష్ కుమారుడు కచ్చిలేటి వెంకటేష్ (27), తిరుపతిలోని భవాని నగర్ సబ్ పోస్ట్ ఆఫీస్ వీధిలో నివాసముంటున్న శ్రీనివాసరావు ఇంట్లో ఈనెల 11వ తేదీన చోరీకి పాల్పడ్డాడు. శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు మేడమీద గదిలో నిద్రిస్తున్న సమయంలో.. వెంకటేశ్ ఇంటి తాళాలు పగులగొట్టి సుమారు 50 గ్రాముల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లాడు. శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు ఈస్ట్ పోలీసులు మంగళవారం ఉదయం తుడా కూడలి వద్ద పెట్రోలింగ్ చేస్తుండగా ఓ వ్యక్తి కదలికలు అనుమానాస్పదంగా కనిపించాయి. అతడిని పట్టుకుని విచారించగా శ్రీనివాసరావు ఇంట్లో చోరీకి పాల్పడింది తానేనని అంగీకరించాడు. అతను నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వివరించారు. 

click me!