రాష్ట్రంలోని తిరుపతి, రాజమండ్రి నుండి విదేశాలకు నేరుగా విమాన సర్వీసులు నడవనున్నాయి త్వరలో. ఇండిగో విమానసంస్ధ అందుకు అవసరమైన ఏర్పాట్లను చేస్తోంది. విదేశాలకే కాకుండా దేశంలోని ఇతర నగరాలకు కూడా నేరుగా ప్రయాణించే సౌకర్యం అందుబాటులోకి తేనున్నది.
ఎయిర్ బస్, ఏటిఆర్ విమానాలతో కూడిన తమ నెట్ వర్క్ తో పై ప్రాంతాలను జత చేసేందుకు కొత్తగా 63 కనెక్టింగ్ విమానాలుంటాయి. ప్రస్తుతానికి సింగపూర్, దుబాయ్, మస్కట్ తో పాటు ఢిల్లీ, ముంబాయ్, కొల్ కత్తా, బెంగుళూరు, హైదరాబాద్, చెన్నై, మంగళూరు ప్రాంతాలకు ప్రయాణించవచ్చని ఇండిగో యాజమాన్యం ప్రకటించింది.
ప్రపంచంలోని ప్రముఖ హిందూ దేవాలయమైన తిరుమలకు ప్రతిరోజు కొన్ని లక్షలమంది యాత్రికులు వస్తుంటారు. తిరుమలకు చేరుకోవాలంటే ముందుగా తిరుపతికి రావాల్సిందే. అంతేకాకుండా బెంగుళూరు, చెన్నై నగరాలకు సుమారు రెండున్నరగంటల ప్రయాణ దూరంలోనే తిరుపతి ఉంది. రాయలసీమలోని నాలుగు జిల్లాల నుండి గల్ఫ్ దేశాలకు ఎక్కువగా వెళుతుంటారన్న విషయం అందరికీ తెలిసిందే. అటువంటి వారికి బాగా సౌకర్యంగా ఉంటుంది
తిరుమల వెంకటేశ్వరుని దర్శనానికి రోజూ ప్రపంచం నలుమూలల నుండి వస్తుంటారు. కాబట్టి విదేశాల నుండే కాకుండా దేశంలోని పలు నగరాలనుండి నేరుగా విమాన సర్వీసుల కోసం సంవత్సరాల తరబడి డిమాండ్ వినిపిస్తోంది.
అయితే, బిజినెస్ పరంగా లాభం లేదన్న ఉద్దేశ్యంతో ఇండియన్ ఎయిర్ లైన్స్, ఎయిర్ ఇండియా తదితర విమాన సంస్ధలు డిమాండ్లను పట్టించుకోలేదు. అయితే, మారిన పరిస్ధితుల్లో తిరుపతికి ప్రాముఖ్యత పెరగటంతో విమాన సంస్ధలు సర్వీసులను నడపటానికి మొగ్గు చూపుతున్నాయి. అందులో భాగమే మూడు దేశాలకు నేరుగా విమాన సర్వీసులు మొదలవుతున్నాయి.