శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తండాకు చెందిన మురళీ నాయక్ జవానుగా 2022లో అగ్నివీర్ పథకం ద్వారా భారత సైన్యంలో చేరారు. నాసిక్లో విధులు నిర్వహించిన ఆయన, ఇటీవల ఆపరేషన్ సిందూర్ కోసం జమ్మూకశ్మీర్కు వెళ్లాడు.
పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోవడం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
శనివారం మురళీ నాయక్ పార్థివ దేహాన్ని ఆయన స్వగ్రామం కల్లితండాకు తీసుకువచ్చారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని "జై జవాన్" నినాదాలతో నివాళులు అర్పించారు. ఆదివారం అధికారిక లాంఛనాలతో మురళీ నాయక్ అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా కల్లితండాకు చేరుకుని మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కుటుంబానికి అండగా నిలుస్తాయని హామీ ఇచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా, ఐదెకరాల భూమి, 300 గజాల ఇల్లు స్థలం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశాన్ని ప్రకటించింది. అదేవిధంగా మురళీ నాయక్ స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగత నిధుల నుంచి కూడా రూ.25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.
ఈ క్రమంలో సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా స్పందించారు. తన నెల జీతాన్ని మురళీ నాయక్ కుటుంబానికి ఆర్థిక సాయంగా ప్రకటించారు. మే 12వ తేదీన స్వగ్రామానికి వెళ్లి, కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందించనున్నారు.