విజయవాడలో దారుణం జరిగింది. అనుమానంతో భార్యను దారుణంగా నరికిన భర్త తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.
విజయవాడలో దారుణం జరిగింది. అనుమానంతో భార్యను దారుణంగా నరికిన భర్త తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. విజయవాడ సమీపంలోని జక్కంపూడి కాలనీకి చెందిన అవనిగడ్డ నరసింహారావు, కృష్ణకుమారి దంపతులు... వీరికి 25 ఏళ్ల కిందట వివాహామైంది, ఇద్దరు పిల్లలున్నారు.
వెల్డింగ్ పనులు చేసే నరసింహారావుకు తొలి నుంచి భార్యపై అనుమానం ఉండేది. ఇద్దరు పిల్లలకు పెళ్లిళ్లు చేసినా ఆ అనుమానం వీడలేదు. ప్రతిరోజు భార్యాభర్తలు ఈ విషయంలో గొడవ పడేవారు.
అతని వేధింపులు తాళలేని కృష్ణకుమారి మూడు రోజుల కిందట ఇబ్రహీంపట్నంలోని జూపూడిలో ఉంటున్న అక్క వద్దకు వెళ్లింది. దీంతో భర్త ఫోన్ చేసి ఈసారి ఇంటికి రావాలని కోరాడు. భర్త విజ్ఞప్తిని మన్నించి మూడో తేదీ రాత్రి ఆమె ఇంటికి వచ్చింది.
పని నుంచి ఇంటికి చేరుకున్న నరసింహారావు.. భార్య నిద్రలో ఉండగానే గొడ్డలితో నుదిటిపై నరికాడు. దీంతో ఆమె మంచంపైనే ప్రాణాలు విడిచింది. కృష్ణకుమారిని హత్య చేసిన తర్వాత గొడ్డలిని బాత్రూమ్లో శుభ్రం చేసేందుకు ప్రయత్నించాడు.
తెల్లవారితే విషయం అందరికీ తెలిసిపోతుందనే భయంతో తాను కూడా ఫ్యాన్కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శనివారం ఇంట్లో నుంచి ఇద్దరు బయటకు రాలేదు. అనుమానం వచ్చిన కొడుకు జాషువా తలుపు కొట్టినా తీయకపోవడంతో.. ఇంకా నిద్రలేవలేదని భావించి వెళ్లిపోయాడు.
మళ్లీ వచ్చి చూసినా బయటకు రాకపోవడంతో తలుపు గట్టిగా చూడగా.. రక్తపు మడుగులో తల్లీ, ఫ్యాన్కు ఉరేసుకుని తండ్రి విగతజీవులుగా పడివున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరిలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.