విషాదం.. భార్య కళ్లముందే గుండెపోటుతో భర్త మృతి..

By AN TeluguFirst Published Oct 1, 2021, 9:02 AM IST
Highlights

బ్యాంకులోకి వెళ్లక ముందే తాతాలు గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. స్థానికులు వచ్చి సపర్యలు చేసినా ఫలితం లేకపోయింది. భర్త మృతితో రాములమ్మ కన్నీటిపర్యంతమైంది. బంధువులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన చేరుకుని మృతుడిని ఆటోలో స్వగ్రామానికి తరలించారు. 

విజయనగరం (Vizianagaram) జిల్లా కొత్తవలసలో విషాదం చోటు చేసుకుంది. ఆయన రైల్వే విశ్రాంత ఉద్యోగి. ఇంటి ఖర్చులకు డబ్బులు అవసరం కావడంతో భార్యతో కలిసి బయలు దేరాడు. ఇద్దరూ ఒకరికి ఒకరు తోడుగా, కష్ట సుఖాలు చెప్పుకుంటూ బ్యాంకు వద్దకు చేరుకున్నారు. బ్యాంకు మెట్లు ఎక్కనేలేదు. అక్కడ ఉన్న ఏటీఎం (ATM)వద్ద ఒక్కసారిగా వృద్ధుడు గుండెపోటుతో(Heart Attack) కుప్పకూలిపోయాడు. ఏం జరిగింతో వృద్ధురాలైన భార్య తెలుసుకునే లోపే ప్రాణం విడిచాడు. ఈ హృదయవిదారక ఘటన కొత్త వలస స్టేట్ బ్యాంక్ వద్ద గురువారం చోటు చేసుకుంది. 

జీవితాంతం తోడుంటానని.. జీవితచరమాంకం దాకా నడిచి వచ్చిన భర్త.. చివర్లో చేసిన వాగ్ధానాన్ని మరిచి అనంతలోకాలకు వెళ్లడంతో ఆ భార్య విషాదంలో మునిగిపోయింది. భర్తకు ఏమయ్యిందో తెలుసుకునే లోపే.. తన కళ్లెదుటే తిరిగిరాని లోకాలకు పయనం అవ్వడంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోయింది. కళ్లెదుటే భర్త గిలగిలలాడుతుంటే.. విషయం కనుక్కునే లోపే మరణించడం ఆమెను షాక్ కు గురి చేసింది. పార్వతీ పరమేశ్వరుల్లా ఉన్న వారిద్దరికీ ఇలా జరగడంతో చూసినవారంతా విషాదంలో మునిగిపోయారు. 

దురాశ.. బ్లేడ్ తో తనను తానే కోసుకుని.. దొంగల దాడి అని నాటకం..

వివరాల్లోకి వెడితే... ఎల్. కోట మండలం మల్లివీడు గ్రామానికి చెందిన బోదం తాతాలు (75) రేల్వేలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. ఈయన ఇద్దరు పిల్లలకు వివాహాలు కావడంతో హైదరాబాద్ లో నివసిస్తున్నారు. భార్యాభర్తలిద్దరూ మల్లివీడులో ఉంటున్నారు. పెన్షన్ డబ్బులు డ్రా చేసేందుకు భార్య రాములమ్మతో కలిసి బ్యాంకుకు బయలుదేరారు. 

బ్యాంకులోకి వెళ్లక ముందే తాతాలు గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. స్థానికులు వచ్చి సపర్యలు చేసినా ఫలితం లేకపోయింది. భర్త మృతితో రాములమ్మ కన్నీటిపర్యంతమైంది. బంధువులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన చేరుకుని మృతుడిని ఆటోలో స్వగ్రామానికి తరలించారు. 

click me!