
ఇపుడిదే చర్చ టిడిపిలో విస్తృతంగా జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో టిఆర్ఎస్-టిడిపిలు గనుక పొత్తు పెట్టుకుంటే ఏపిలో అధికారాన్ని చంద్రబాబే జగన్ కు బంగారుపళ్ళెంల్లో పెట్టి అప్పగించినట్లవుతుందన్నది మెజారిటీ నేతల వాదన. అదే సందర్భంలో టిఆర్ఎస్ తో పొత్తున్నది టిడిపికి ఆత్మహత్యతో సమానమే అని కూడా పలువురు నేతలు చర్చించుకుంటున్నారు. ఈ నేపధ్యంలోనే రాజకీయాల్లో ‘ఆత్మహత్యలే కానీ హత్యలుండవు’ అనే పాపులర్ పదాన్ని గుర్తుచేసుకుంటున్నారు.
ఒక్కోసారి అనాలోచితంగా తీసుకునే నిర్ణయాలే మెడకు ఉరితాడై బిగుసుకుంటుంది. దాంతో పార్టీలు కావచ్చు నేతలు కావచ్చు ప్రాభవం కోల్పోయి ఎందుకు పనికిరాకుండా పోతారన్నది అర్ధం. అందుకు కాంగ్రెస్ పార్టీని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే, పచ్చగా ఉన్న సమైక్య రాష్ట్రాన్ని విభజించటం ద్వారా కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతేంటో అందరూ చూసిందే. టిడిపిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే చంద్రబాబునాయుడు కూడా కాంగ్రెస్ పార్టీ దారిలోనే వెళుతున్నారా ? అన్న అనుమానాలు అందరిలోనూ మొదలైంది.
హటాత్ పరిణామాలకు ఒకరకంగా చంద్రబాబు- రేవంత్ ఇద్దరూ బాధ్యులే. వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో టిఆర్ఎస్-టిడిపి కలిసి పోటీ చేయాలని కొందరు సీనియర్ నేతలు ప్రతిపాదించారు. అందుకు చంద్రబాబు కూడా సానుకూలంగానే ఉన్నారట. దాంతో కెసిఆర్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సీనియర్ల ప్రతిపాదనపై భగ్గుమన్నారు.
చంద్రబాబు వైఖరిపై అనుమానంతోనే తనదారి తాను చూసుకోవాలని రేవంత్ నిర్ణయించుకున్నారు. అందుకే ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దలను కూడా కలిసారు. దాంతో తెలంగాణా రాజకీయాల్లోనే కాకుండా టిడిపిలో కూడా ఒక్కసారిగా సెగలు మొదలైంది. శుక్రవారం జరిగిన టిడిపి పొలిట్ బ్యూరో సమావేశంలో జరిగిన పరిణామాలే చాలు పరిస్ధితి ఎంత దయనీయంగా మారిపోయిందో చెప్పటానికి.
టిడిపిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే టిఆర్ఎస్ తో పొత్తు ఖాయంలాగే అనిపిస్తోంది. ఒకవేళ అదే నిజమైతే ఏపిలో కాంగ్రెస్ కు పట్టిన గతే తెలంగాణాలో టిడిపికి పడుతుందనటంలో సందేహమే అక్కర్లేదు. ఎందుకంటే, రాష్ట్ర విభజనకు కారణమైన కెసిఆర్ తో చంద్రబాబు ఎలా పొత్తు పెట్టుకుంటారు? తెలంగాణాలో పెట్టుకున్న పొత్తు ప్రభావం ఏపి మీద పడకుండానే ఉంటుందా ? ఒకవేళ అదే నిజమైతే వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అధికారాన్ని స్వయంగా చంద్రబాబే బంగారు పళ్ళెంలో పెట్టి అప్పగించినట్లవుతుంది.