రాజధానిపై రేపు కీలక ప్రకటన: క్షణ క్షణం.. హైటెన్షన్

By Siva KodatiFirst Published Jan 19, 2020, 9:54 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాజధానిపై రేపు కీలక ప్రకటన ఉన్న నేపథ్యంలో రాష్ట్రప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా మూడు రాజధానుల ప్రకటన చేస్తారా..? లేక మరో వాదన తెరపైకి తీసుకొస్తారా అన్న దానిపై సోమవారం క్లారిటీ రానుంది

ఆంధ్రప్రదేశ్ రాజధానిపై రేపు కీలక ప్రకటన ఉన్న నేపథ్యంలో రాష్ట్రప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా మూడు రాజధానుల ప్రకటన చేస్తారా..? లేక మరో వాదన తెరపైకి తీసుకొస్తారా అన్న దానిపై సోమవారం క్లారిటీ రానుంది.

మరోవైపు ప్రాణాలు ఇచ్చి అయినా సరే అమరావతిని నిలబెట్టుకుంటామని రైతులు చెబుతున్నారు. ఆదివారం నేలపాడులో నలుగురు రైతులు 13 అంతస్తుల భవనంపైకి ఎక్కడం ఆందోళన కలిగించింది. అమరావతి పరిరక్షణ సమితి, తెలుగుదేశం పార్టీలు సోమవారం అసెంబ్లీని ముట్టడించాలని పిలుపునిచ్చాయి.

దీంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. అసెంబ్లీ పరిసరాల్లో భారీగా మోహరించడంతో పాటు అటుగా వెళ్లాల్సిన వారు ప్రత్యామ్యాయ మార్గాలను చూసుకోవాలని సూచించారు. అసెంబ్లీ చుట్టూ ఐదంచెల భద్రతను ఏర్పాటు చేసి సుమారు 5 వేలమందిని మోహరించారు.

Also Read:మూడు రాజధానులు: జగన్ ప్రభుత్వానికి మండలి గండం, వ్యూహం ఇదీ...

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెళ్లే మార్గాల్లోను పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. తాడేపల్లిలోని సీఎం నివాసం నుంచి సచివాలయం వరకు ట్రయల్ నిర్వహించారు. అటు ప్రకాశం బ్యారేజ్‌పైనా పోలీసులు ఆంక్షలు విధించారు.

తెల్లవారుజాము 4 నుంచి ఆంక్షలు అమల్లోకి వస్తాయని విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. అసెంబ్లీ, హైకోర్టుకు వెళ్లే వాహనాలను మాత్రమే అనుమతిస్తామని, సాధారణ వాహనాలపై ఆంక్షలు ఉంటాయన్నారు. విజయవాడలోని సమస్యాత్మక ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించామని, నగరం మొత్తం 30 యాక్ట్ అమల్లో ఉంటుందని తెలిపారు.

Also Read:ముగిసిన టీడీఎల్పీ భేటీ: అసెంబ్లీలో తెలుగుదేశం వ్యూహం ఇదే

అమరావతిపై కీలక ప్రకటన, అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై  మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధ్యక్షతన టీడీఎల్పీ భేటీ అయ్యింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర నేతలు పాల్గొన్నారు.

అనంతరం సమావేశ వివరాలను టీడీఎల్పీ ఉపనేత నిమ్మల రామానాయుడు మీడియాకు వివరించారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలనే డిమాండ్‌కు తాము కట్టుబడి ఉన్నామన్నారు. ఇలాంటి పరిస్ధితుల్లో రేపు ఏం జరగబోతుందోనని రాష్ట్ర ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. 

click me!