తిరుపతిలో వర్షబీభత్సం.. దాదాపు నగరమంతా నీటిలోనే, రాత్రంతా వానపడితే భయానకమే

Siva Kodati |  
Published : Nov 11, 2021, 09:25 PM IST
తిరుపతిలో వర్షబీభత్సం.. దాదాపు నగరమంతా నీటిలోనే, రాత్రంతా వానపడితే భయానకమే

సారాంశం

వాయుగుండం కారణంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తిరుపతి నగరం (tirupati floods) నీటమునిగింది. చరిత్రలో కనివినీ ఎరుగుని రీతిలో వర్షం కురుస్తోంది. నగరంలోని లీలా మహాల్ సెంటర్ వద్ద పలు కాలనీలు నీట మునిగాయి.  ఈ రాత్రంతా వర్షం కురిస్తే పరిస్ధితి మరింత ఆందోళనకరంగా మారుతుందని స్ధానికులు భయపడుతున్నారు. 

వాయుగుండం కారణంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తిరుపతి నగరం (tirupati floods) నీటమునిగింది. చరిత్రలో కనివినీ ఎరుగుని రీతిలో వర్షం కురుస్తోంది. నగరంలోని లీలా మహాల్ సెంటర్ వద్ద పలు కాలనీలు నీట మునిగాయి. మధురానగర్ , సత్యనారాయణ పురం, మంగళం రోడ్డు, జీవ కోన, వెంకటేశ్వర కాలనీలు జలదిగ్భందంలో వున్నాయి. మంగళం రోడ్డులో వాహనాలకు అనుమతిని నిలిపివేశారు అధికారులు. పలు ప్రాంతంలో కాలువలకు గండ్లు కొడుతున్నారు స్థానికులు. ఇప్పటికే దాదాపు తిరుపతి నగరం (tirupati rains) నీటమునిగింది. ఈ రాత్రంతా వర్షం కురిస్తే పరిస్ధితి మరింత ఆందోళనకరంగా మారుతుందని స్ధానికులు భయపడుతున్నారు. తిరుపతిలో ఆర్టీసీ బస్టాండ్, రైల్వే బ్రిడ్జి నీటమునిగింది. అలాగే ఎమ్మార్‌పల్లి ప్రాంతం కూడా జలదిగ్భందంలో చిక్కుకుంది. జన జీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. ప్రధాన రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. 

అటు అరణియార్ జలాశయానికి భారీగా వరద నీరు పోటెత్తింది. అరణియార్ జలాశయం (araniyar) నుంచి 10,500 క్యూసెక్కుల నీరు విడుదల చేయడంతో శ్రీకాళహస్తి- పిచ్చాటూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు నెల్లూరు జిల్లాలో వేటకు వెళ్లిన 11 మంది మత్స్యకారులు సముద్రంలో చిక్కుకుపోయారు. మత్య్సకారులంతా అల్లూరు మండలం తాటిచెట్లవారిపాలెం వాసులుగా గుర్తించారు. సాంకేతిక లోపం కారణంగా సముద్రంలోనే ఆగిపోయింది వారి బోటు. సమాచారం అందుకున్న కృష్ణపట్నం కోస్ట్‌గార్డ్స్ (krishna patnam) మత్స్యకారులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. 

ALso Read:తీరాన్ని దాటిన వాయుగుండం: విరిగిపడిన చెట్లు, వరదనీటితో భయానకం, చెన్నైకి విమానాల నిలిపివేత

అంతకుముందు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గురువారం చెన్నై (chennai rains) సమీపంలో తీరాన్ని దాటింది. గంటకు 4 కిలోమీటర్ల వేగంతో కదిలిన వాయుగుండం పశ్చిమ వాయువ్యదిశగా కదులుతూ చెన్నైకి దిగువన తీరాన్ని దాటినట్టు వాతావరణశాఖ ప్రకటించింది. వాయుగుండం భూ భాగంపైకి వచ్చిన అనంతరం క్రమంగా బలహీనపడుతుందని వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో తిమళనాడుతో (tamilnadu rains) పాటు కోస్తాంధ్రలోని నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నట్టు ఐఎండీ వెల్లడించింది.

రాగల 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మరో వైపు వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న జిల్లాల్లో యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్టు రాష్ట్ర విపత్తు నిర్వహణశాఖ కమిషనర్‌ కె.కన్నబాబు తెలిపారు. అత్యవసర సహాయ చర్యల కోసం చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను పంపించినట్టు పేర్కొన్నారు. మరో వైపు ఈనెల 13న అండమాన్‌ తీర ప్రాంతంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది. ఇది నవంబర్‌ 17 నాటికి బలపడి తీరాన్ని దాటే అవకాశమున్నట్టు ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణశాఖ స్పష్టం చేసింది.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్