
పోలింగ్ తేదీ దగ్గర పడేకొద్దీ వైసీపీని మానసికంగా బలహీనపరిచే కార్యక్రమాలను చేపట్టాయి టిడిపి వర్గాలు. నంద్యాల ఉపఎన్నికలో వైసీపీ ధాటికి టిడిపి దాదాపు చేతులెత్తేసింది. అందుకనే తాజాగా వైసీపీ నేత గంగుల ప్రతాపరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసారంటూ బుధవారం రాత్రి నుండి పెద్ద ఎత్తున ప్రచారానికి దిగాయి.
మంత్రి అచ్చెన్నాయడుతో కలిసి గంగుల సచివాలయం అమరావతిలో కలిసినట్లు మీడియాలో పెద్దఎత్తున ప్రచారం చేయించుకున్నాయి. సిఎంను కలిసిన ప్రతాపరెడ్డి, వైసీపీ ఎంఎల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డికి స్వయానా సోదరుడవటంతోనే ఈ వార్తకు ప్రాధాన్యత వచ్చింది. లేకపోతే, గంగుల ప్రతాపరెడ్డి ఎవరో చాలా మందికి తెలీదసలు.
అయితే, ఇపుడే ఈ ప్రచారాన్ని ఎందుకు తలకెత్తుకున్నాయ్ టిడిపి వర్గాలు? గెలుపోటములన పక్కనబెడితే నంద్యాలలో వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి దెబ్బకు ప్రచారంలో మాత్రం టిడిపి కుదేలైపోయింది. అందుకే సినీనటుడు కమ్ చంద్రబాబు బావమరది బాలకృష్ణను కూడా రంగంలోకి దింపింది టిడిపి. అయినా పెద్దగా ఉపయోగం కనబడినట్లు లేదు. అందుకనే బుధవారం రాత్రి నుండి ‘వైసీపీకి గంగుల షాక్’ అంటూ ప్రచారం మొదలైంది.
నిజానికి గంగుల ప్రతాప్ రెడ్డికి వైసీపీకి ఏమీ సంబంధం లేదు. గంగుల ప్రభాకర్ రెడ్డి వైసీపీలో చేరిన తర్వాత ఒకసారి ప్రతాపరెడ్డి కూడా జగన్ను కలిసింది వాస్తవమే. వైసీపీలో చేరినట్లు ప్రతాపరెడ్డీ ప్రకటించలేదు, చేర్చుకున్నట్లు వైసీపీ కూడా ప్రకటించలేదు. ప్రతాపరెడ్డి ఎప్పుడైతే జగన్ను కలిసారో వెంటనే ప్రతాపరెడ్డి వైసీపీలో చేరిపోయారంటూ మీడియానే ఊదరగొట్టేసింది. కానీ ప్రస్తుతానికైతే ప్రతాపరెడ్డి కాంగ్రెస్ నేత అన్నది వాస్తవం.
వైసీపీకి సంబంధంలేని కాంగ్రెస్ నేత టిడిపిలో చేరితే వైసీపీకి షాక్ ఎలా అవుతుంది? ఉంటేగింటే కాంగ్రెస్ కు షాక్ అని ప్రచారం చేసుకోవాలి. అంతే కానీ వైసీపీకి షాక్ అని ప్రచారం చేసుకుంటోందంటేనే టిడిపి దివాలాకోరుతనం అర్ధమైపోతోంది. గంగుల-చంద్రబాబు భేటీని అడ్డుపెట్టుకుని వైసీపీపై బురదచల్లుదామని టిడిపి చూస్తోందని అర్ధమైపోతోంది. నంద్యాలలో గెలుపుపై టిడిపిలో ఎంతటి అభద్రతలో కొట్టుకుంటోందో అందరికీ తెలిసిపోతోంది.