గ్రూపు-3 ఉద్యోగాలకు ఆగస్టు 6, 7 తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి. ఏపీపీఎస్సీ ద్వారా ఇప్పటికే గ్రూపు-3 పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగా పరీక్షల షెడ్యూల్ ను విడుదలచేసింది ఏపీపీఎస్సీ. ఇప్పటికే ఉద్యోగ నియామకాలను వేగవంతం చేసిన ప్రభుత్వం, గ్రూపు-3 ఉద్యోగాల్లో భాగమైన పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగాల భర్తీకి వేగంగా ఏర్పాట్లు చేస్తోంది.
ఈ పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా స్థాయి అధికారులను ఏపీపీఎస్సీ ఆదేశించింది. విద్యార్థులసౌకర్యార్థం రెండు రోజులు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పబ్లిక్ సర్వీస్ కమీషన్ తెలిపింది. శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ఆగస్టు 6న పరీక్ష నిర్వహించనున్నారు. మరసటిరోజు విజయనగరం, తూర్పుగోదావరి, నెల్లూరు, కర్నూలు జిల్లాలో నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి వైవీఎస్టీ సాయి తెలిపారు.
రెండు రోజుల్లో హాల్టిక్కెట్లను వెబ్సైట్లో ఉంచుతామని ఆయన తెలిపారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ముందుగానే చేరుకోవాలని, ఆలస్యంగా వచ్చి వారిని పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించమని అన్నారు.
అలాగే సాంఘిక, గిరిజన సహాయ సంక్షేమ అధికారుల పోస్టులకు సెప్టెంబరు 23న పరీక్ష నిర్వహించనున్నామని, గ్రూపు-1 పరీక్షలను ఆగస్టు 17 నుంచి 28వ తేదీ వరకు జరపడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సాయి తెలిపారు.