ఇసుక పాలసీపై ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘిస్తోంది: పురంధేశ్వరి

By Mahesh RajamoniFirst Published Nov 2, 2023, 2:27 AM IST
Highlights

Purandeswari: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర బీజేపీ చీఫ్ ద‌గ్గుపాటి పురంధేశ్వ‌రి మ‌రోసారి ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌ర్కారును టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌లు గుప్పించారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రకారం ఇసుక తవ్వకాలకు భారీ యంత్రాలను ఉపయోగించరాదనీ, అయితే ఇది రాష్ట్రంలో దారుణంగా ఉల్లంఘించబడుతుందని ఆమె అన్నారు.
 

Andhra Pradesh-Sand Policy: ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నాయ‌క‌త్వంలోని వైఎస్ఆర్సీపీ ప్ర‌భుత్వం ఇసుక విధానానికి సంబంధించిన నిబంధనలన్నింటినీ ఉల్లంఘిస్తోంద‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ భార‌తీయ జ‌నతా పార్టీ (బీజేపీ) అధ్య‌క్షురాలు ద‌గ్గుపాటి పురంధేశ్వ‌రి ఆరోపించారు. ఇసుక ధరలను విపరీతంగా పెంచి రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్మికుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతున్నార‌ని అన్నారు. గత టీడీపీ హయాంలో ట్రాక్టర్ ఇసుకను రూ.1000 నుంచి రూ.1500 వరకు విక్రయించేవారని పేర్కొన్న ఆమె.. వైకాపా స‌ర్కారు ట్రాక్టర్‌లోడు ధరను రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకు పెంచిందన్నారు. ఇళ్లు నిర్మించుకుంటున్న సామాన్యులపై భారం మోపిందని స‌ర్కారుపై మండిప‌డ్డారు. 

పెరిగిన ఇసుక ధరలను సామాన్యులు, పేదలు భరించలేక నిర్మాణ పనులను నిలిపివేశారని పురంధేశ్వ‌రి అన్నారు. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో పురంధేశ్వరి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఇసుక విధానం వల్ల రాష్ట్రంలో 35 లక్షల నుంచి 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు జీవనోపాధి కోల్పోయారన్నారు. మే 3, 2021న రాష్ట్ర ప్రభుత్వం ఇసుక విధానాన్ని సవరించిందనీ, న్యూఢిల్లీకి చెందిన జయ ప్రకాష్ పవర్ వెంచర్‌కు చెందిన ఒక కాంట్రాక్టర్‌కు మాత్రమే కాంట్రాక్టు ఇచ్చిందని తెలిపిన ఆమె.. రాష్ట్రానికి రూ.760 కోట్ల రాయల్టీ చెల్లించాల్సిన కాంట్రాక్టర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నార‌ని తెలిపారు. ఒప్పందం ప్రకారం కాంట్రాక్టర్ సబ్ లీజ్ లో పనులు ఇవ్వొద్దని చెప్పారు. కానీ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాంట్రాక్టర్ టర్న్ కీ ఎంటర్ ప్రైజెస్ కు సబ్ లీజ్ ఇచ్చారన్నారు.

ఒప్పందం ప్రకారం కాంట్రాక్టర్ కు నెలకు రూ.188 కోట్లు ఆదాయం వస్తుందని, అయితే ప్రతి నెలా రూ.63 కోట్ల రాయల్టీని మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి జమ చేస్తున్నారని పురందేశ్వరి తెలిపారు. మిగిలిన రూ.125 కోట్లు ఇసుక విక్రయాల ద్వారా ప్రతినెలా తాడేపల్లి అధికార నాయ‌కుల‌ జేబులోకి వెళుతున్నాయని ఆరోపించారు. కాంట్రాక్టర్ లీజు కాలం 2022 మేతో ముగిసిందనీ, అయినప్పటికీ రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు కొనసాగుతున్నాయని తెలిపారు. లారీలో ఇసుక లోడింగ్ లో కూడా అవకతవకలు జరుగుతున్నాయని, బిల్లులో తక్కువ పరిమాణం చూపించారని ఆమె ఆరోపించారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రకారం ఇసుక తవ్వకాలకు భారీ యంత్రాలను ఉపయోగించరాదు, అయితే ఇది రాష్ట్రంలో దారుణంగా ఉల్లంఘించబడుతుందని ఆమె అన్నారు.

బీజేపీ ప్రజల గొంతుక అనీ, ఇసుక విధానంపై ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘించి, రాష్ట్రంలో నిర్మాణ కార్యకలాపాలపై ప్రభావం చూపుతున్న ఇసుకను అధిక ధరలకు ఎలా విక్రయిస్తోందో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియజేసేందుకు ప్రెస్ మీట్ నిర్వహించామని ఆమె అన్నారు. ఇసుక పాలసీ అమలులో అనేక అవకతవకలు జరిగాయనీ, ఒక్క కాంట్రాక్టర్‌కే ఇసుక తవ్వకాలకు ఎందుకు అనుమతి ఇచ్చారని పురంధేశ్వ‌రి ప్రశ్నించారు.

click me!