విజయవాడ కనకదుర్గ ఆలయం ఇవో సూర్యకుమారిపై బదిలీ వేటు పడింది. పోయిన డిసెంబర్ నెల 26వ తేదీన ఆలయంలో క్షుద్రపూజలు జరిగాయని వివాదం చెలరేగుతున్న విషయం అందరకీ తెలిసిందే. ఇంత గొడవ జరుగుతున్నా ఆలయంలో ఎటువంటి తాంత్రికపూజలు జరగలేదని ఇవో చెబుతూన్నారు అయితే, సిసి ఫుటేజిలో బయటపడిన ఆధారాలతో ఆలయంలో ఏదో జరిగిందనే అనుమానాలు సర్వత్రా బలపడ్డాయి. పోలీసుల జోక్యంతో ఆలయంలో క్షుద్రపూజలు జరిగాయని పూజలు చేసిన వాళ్ళు అంగీకరించినట్లు ప్రచారం మొదలైంది. దానికితోడు శారధా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి జోక్యం చేసుకోవటంతో వివాదం కొత్త మలుపు తిరిగింది.
ఆలయంలో క్షుద్రపూజలు జరిగాయని స్వరూపానంద సరస్వతి కూడా స్పష్టంగా చెప్పటంతో దాంతో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిపోయింది. దానికి తోడు దేవాలయంలో జరిగిన పూజలపై వైసిపి నేతలు మాట్లాడుతూ, నారా లోకేష్ కోసమే ఆలయంలో ఇవో క్షుద్రపూజలు జరిపించారని మండిపడుతున్నారు. దాంతో వివాదం ప్రభుత్వం చేయి దాటిపోయే పరిస్ధితి కనిపిస్తుండటంతో తక్షణమే ఆలయ ఇవో సూర్యకుమారిపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. మంగళవారం వరకూ వివాదంపై నోరు విప్పని ప్రభుత్వం బుధవారం ఇవోని బదిలీ చేయటంతో సర్వత్రా అనుమానాలు మొదలయ్యాయి. వివాదాన్ని నీరు గార్చటానికే ఇవో బదిలీ జరిగిందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయ్.