
రాష్ట్రంలో సరికొత్త వైన్ ఒకటి రాబోతోంది. పనసపండ్లతో తయారు చేసే వైన్ రాష్ట్ర మద్యం మార్కెట్ ను ముంచెత్తబోతోంది. అంటే మద్యం ప్రియులు సరికొత్త వైన్ రుచి చూస్తారన్న మాట. గోవాలో ఒకరకమైన వైన్ దొరుకుతుంది. అదే ‘ఫెన్నీ’. దాన్ని గోవాలో మాత్రమే తయారు చేస్తారు. గోవాలో మాత్రమే అమ్ముతారు. దేశంలో ఇంకెక్కడా తయారు చేసేందుకు లేదు, అమ్మేందుకూ లేదు. అది రూల్. ఒకవిధంగా మద్యం ప్రియులకు గోవా అనగానే ఫెన్నీనే గుర్తుకువస్తుంది. అంతలా పర్యాటకులను ఫెన్నీ ఆకర్షిస్తోంది.
అదే స్టైల్లో పనసపండ్లతో వైన్ తయారు చేస్తే ఎలాగుంటుందన్నఆలోచన గిరిజన సహకార కార్ర్పొరేషన్ (జిసిసి)కి వచ్చింది. ఎందుకంటే, విశాఖపట్నంలోని ఏజెన్సీ ప్రాంతంలో పనసపండ్లు చాలా ఎక్కువగా పండుతాయి. అయితే, ఏడాదికి నాలుగు మాసాలు మాత్రం దొరుకుతాయి. గిరిజన ప్రాంతాల్లో పనసనుండి మద్యాన్ని తయారు చేసుకుని తాగుతుంటారు స్ధానిక గిరిజనులు. అవి చాలా కొద్ది పరిణామంలో మాత్రమే తయారు చేసుకుంటున్నారు. అంటే వారు తాగటానికి మాత్రమే. వాటి రుచి చాలా బాగుంటుందట.
స్ధానిక గిరిజనులు తయారు చేసుకుంటున్నారంటే నాటు పద్దతిలోనే ఉంటుంది. ఒకసారి అధికారులు కూడా వాటి రుచి చూసారు. అద్భుతంగా ఉందని అనుకున్నారు. అదే సమయంలో కర్నాటక రాష్ట్రంలోని కూర్గ్ లో పనసపండ్లతో వైన్ తయారు చేస్తున్నట్లు తెలుసుకున్నారు. దాంతో జిసిసి అధికారులు కూర్గ్ కు ఓ బృందాన్ని పంపారు. బృందం అక్కడి వైన్ టేస్ట్ చేసి చాలా బాగుందని మెచ్చుకున్నది. పనసపండ్ల నుండి వైన్ తయారీ విధానాన్ని కూడా ఆ బృందం అధ్యయనం చేసింది.
వెంటనే కొన్ని పనసపండ్లను చిత్తూరుకు తీసుకెళ్ళి అక్కడి తేనెశుద్ది కర్మాగారంలో పనస వైన్ తయారు చేసారు. బాగానే వచ్చిందనుకున్నారు. శాస్త్రీయ విశ్లేషణ కోసం 5 లీటర్ల పనస వైన్ను కేంద్ర పరిశోధనా సంస్ధకు పంపారు. అక్కడి నుండి ఇంకా సమాధానం రాలేదు. ఒకవేళ అక్కడి నుండి గ్రీన్ సిగ్నల్ వస్తే వెంటనే పనసవైన్ తయారీ మొదలుపెట్టాలని జిసిసి అనుకుంటున్నది. లీటర్ పనసవైన్ రూ. 100కే అమ్మాలని కూడా జిసిసి అనుకుంటున్నది.