ప్రకాశం బ్యారేజీకి వరద హెచ్చరిక.. నెల్లూరులో పొంగిపొర్లుతున్న వాగులు వంకలు

Published : Dec 06, 2023, 09:35 PM IST
ప్రకాశం బ్యారేజీకి వరద హెచ్చరిక.. నెల్లూరులో పొంగిపొర్లుతున్న వాగులు వంకలు

సారాంశం

Cyclone Michaung: మైచౌంగ్ తుఫాను తీరం దాటినప్పటికీ గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నెల్లూరు జిల్లాలో వాగులు వంక‌లు పొంగిపొర్లుతున్నాయి. కాలువలు ఉప్పొంగుతున్నాయి. అలాగే, ప్ర‌కాశం బ్యారేజీ గేట్లు తెరిచి వ‌ర‌ద నీటిని వ‌దులుతున్నారు.    

Flood alert to Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ పరీవాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో వ‌ర‌ద‌నీటి ఇన్ ఫ్లో పెరిగింద‌నీ, ఎఫ్ఆర్ఎల్ కు చేరుకోబోతున్నాయని కృష్ణా సెంట్రల్ డివిజన్ రివర్ కన్జర్వేటర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బుధవారం మీడియాకు తెలిపారు. ఈ మేరకు మిగులు జలాలను ప్రకాశం బ్యారేజీ దిగువకు విడుదల చేయాల్సిన అవసరం ఉందనీ, అంచనా ప్రకారం డిశ్చార్జి 4 వేల క్యూసెక్కులు లేదా అంతకంటే ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఈ క్ర‌మంలోనే ప్రకాశం బ్యారేజీ ఎగువ, దిగువ ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఇప్ప‌టికే వ‌ర‌ద హెచ్చ‌రిక‌లు జారీ చేసిన‌ట్టు సంబంధిత అధికార వ‌ర్గాలు పేర్కొన్నాయి.

మైచౌంగ్ తుఫాను తీరం దాటినప్పటికీ గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నెల్లూరు జిల్లాలో వాగులు వంక‌లు పొంగిపొర్లుతున్నాయి. కాలువలు ఉప్పొంగుతున్నాయి. కనుపూరు కాలువ, నక్కలవాగు, రామన్నచెరువు, సర్వేపల్లి రిజర్వాయర్, కైవల్య, కళంగి తదితర ప్రాంతాలు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. కనుపూరు కాలువకు పగుళ్లు ఏర్పడ్డాయని స‌మాచారం. చుట్టుపక్కల గ్రామాలు ముంపునకు గురికాకుండా ఉండేందుకు జిల్లా యంత్రాంగం నీటిని సముద్రంలోకి వదులుతోంది. నక్కలవాగు వాగు నుంచి సోమవారం నుంచి 6 వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలారు.

వరద ఉధృతి ఎక్కువగా ఉన్నందున జలాశయాలను దాటవద్దని జిల్లా యంత్రాంగం ప్రజలను హెచ్చరించింది. జిల్లాలో తుఫాను పరిస్థితులను పర్యవేక్షించేందుకు ఐఏఎస్ అధికారి సీహెచ్ హరికిరణ్ ను ప్రభుత్వం ప్రత్యేక అధికారిగా నియమించింది. పలు జలాశయాలు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నందున ప్రజలు ఇళ్లలోనే ఉండాలని కలెక్టర్ మంగళవారం విడుదల చేసిన ప్రెస్ నోట్ లో విజ్ఞప్తి చేశారు. తుఫాను కారణంగా జిల్లాలో పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి వస్తున్న ఇన్ ఫ్లోల నేపథ్యంలో కుందూ, పెన్నార్ నదుల నుంచి సోమశిల జలాశయానికి 4 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

నెల్లూరు జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు ప్రస్తుత రబీలో సాగు దశలో ఉన్న వరి పంట రైతులు తీవ్రంగా నష్టపోయారు. పొలాలు పూర్తిగా వర్షపు నీటితో నిండిపోవడంతో పంట నష్టాన్ని లెక్కించడానికి కొంత సమయం పడుతుందని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. తుఫాను కారణంగా జిల్లాలోని మొత్తం 38 మండలాల్లో భారీ వర్షాలు కురిసినట్లు వాతావరణ శాఖ తెలిపింది. అత్యధికంగా మనుబోలు మండలంలో 317.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సోమవారం సీతారామపురంలో 78.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Pawan Kalyan Super Speech: మీచేతఅప్పుడే జేజేలు కొట్టించుకుంటా | Janasena Party | Asianet News Telugu
Chandra Sekhar Pemmasani About Komati Jayaram Representative for North America | Asianet News Telugu