
గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాల కారణంగా గోదావరిలో వరద ప్రవాహం పెరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజమండ్రిలోని ధవళేశ్వరం బ్యారేజీ (dowleswaram cotton barrage) దగ్గర మంగళవారం అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజీ దగ్గర 11.80 అడుగులకు నీటిమట్టం చేరింది. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 9.7 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇకపోతే... ఆంధ్రప్రదేశ్లో రేపు పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం తెలిపింది.
మరోవైపు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (ys jagan) అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. వర్షం కురుస్తున్నప్పటికీ.. వరద బాధితులను పరామర్శిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే అరిగెలవారి పేటలో వైఎస్ జగన్ వరద బాధితులతో మాట్లాడారు. వరద బాధితులందరికీ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తెలుగుదేశం (telugu desam party) అధినేత చంద్రబాబు నాయుడుకు (chandrababu naidu) కౌంటర్ ఇచ్చారు. ప్రజలకు మంచి చేయాలంటే డ్రామాలు పక్కనపెట్టాలని అన్నారు. వరదల సమయంలో డ్రామాలు ఆడకుండా.. అధికారులను అప్రమత్తం చేసి ప్రజలకు సాయం అందేలా చేశానని చెప్పారు.
Also Read:అందుకే వారం రోజుల తర్వాత వచ్చాను: కోనసీమ జిల్లాలో వరద బాధితులతో సీఎం జగన్
‘‘వరదల్లో నేను ఇక్కడకు వచ్చి ఉంటే అధికారులు నా చుట్టూ తిరిగేవాళ్లు. నేను టీవీల్లో బాగా కనబడేవాడని. నా ఫొటోలు బాగా వచ్చేవి. కానీ ప్రజలకు మంచి జరగకపోయేది. ప్రజలకు మంచి చేయాలంటే డ్రామాలు పక్కనపెట్టాలి. ప్రజలకు మంచి చేసేందుకు అధికారులకు అన్ని రకాల వనరులు ఇచ్చాను.అధికారులకు వారం టైం ఇచ్చి నేను ఇక్కడికి వచ్చా. మీ అందరికీ మంచి చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది’’ అని సీఎం జగన్ చెప్పారు.