
గుంటూరు : 'గ్యాంగ్' సినిమాలో హీరో సూర్య నకిలీ సిబిఐ, ఐటీ దాడులు చేసి బడా వ్యాపారులను దోచుకుంటుంటాడు... సేమ్ టు సేమ్ ఇదే సీన్ ఏపీలో రిపీట్ అయ్యింది. ఐటీ అధికారులమంటూ ఓ ఇంట్లో సోదాలు నిర్వహించిన ఓ ముఠా భారీగా బంగారం, నగదుతో ఉడాయించారు. అయితే వెంటనే పోలీసులు అప్రమత్తమైన పోలీసులు సదరు నకిలీ ఐటీ అధికారుల ముఠాను అరెస్ట్ చేసి వారు దోచుకున్న సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
గుంటూరు ఎస్పీ ఆరిఫ్ హఫిజ్ ఈ నకిలీ ఐటీ దాడుల గురించి వివరించారు. గుంటూరు పట్టణంలోని ప్రగతి నగర్ లో నివాసముండే యర్రంశెట్టి కల్యాణి ఇంటికి గత గురువారం ఐటీ అధికారులమంటూ ముగ్గురు వ్యక్తులు వచ్చారు. కారు దిగుతూనే ఇంట్లోని అందరి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని బయటకు సమాచారం వెళ్లకుండా జాగ్రత్తపడ్డారు. అనంతరం ఆదాయపు పన్ను చెల్లించకుండా అక్రమంగా డబ్బును కలిగువున్నారని... ఇంట్లో సోదాలు నిర్వహించాలని చెప్పారు. ఇలా ఇంట్లో వున్న డబ్బులు, నగదుతో పాటు ఆస్తి పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.
అయితే ఐటీ దాడులంటూ హడావుడి చేస్తున్న వారిపై అనుమానం రావడంతో ఐడీ కార్డ్ చూపించాలని కల్యాణి నిలదీసింది. ఇది ముందే ఊహించి ముందుజాగ్రత్తగా తుపాకులతో వచ్చిన దుండగులు వాటితో కుటుంబాన్ని బెదిరించారు. ఇంట్లో వున్నదంతా ఊడ్చేసి వచ్చిన కారులోనే పరారయ్యారు. ఈ నకిలీ ఐటీ దాడులపై బాధిత కుటుంబం ఓల్డ్ గుంటూరు పోలీసులకు ఫిర్యాదుచేసింది. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న వారు ప్రత్యేక బృందాలను దర్యాప్తు చేపట్టి నిందితులను పట్టుకున్నారు.
Read more ఇసుక అక్రమ రవాణాతో సొమ్ము చేసుకుంటున్నారు.. సీఎం జగన్ పై నారా లోకేశ్ విమర్శలు
ఈ నకిలీ ఐటీ అధికారుల ముఠాను మీడియా ముందు ప్రవేశపెట్టారు ఎస్పీ ఆరిఫ్ హఫీజ్. ఐదుగురు నిందితులను అరెస్టు చేసామని... మరొకడు పరారీలో వున్నాడని ఎస్పీ తెలిపారు. నిందితుల నుండి 1,16,30000 రూపాయల విలువగల నగదు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మూడు బృందాలు ఎంతో చాకచక్యంగా ఈ నకిలీ ఐటీ దాడుల పేరిట దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ వెల్లడించారు.
నిందితుల వద్ద పట్టుబడిన సొత్తులో రూ.50 లక్షల విలువచేసే బంగారం, రూ.66లక్షల 30వేల నగదు వున్నట్లు గుంటూరు ఎస్పీ తెలిపారు. పరారీలో వున్న మరో నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోందని అన్నారు. ఇలాంటి దోపిడీలు జరక్కుండా చర్యలు తీసుకుంటున్నామని... ప్రజలు కూడా అప్రమత్తంగా వుండాలని ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ సూచించారు.