ఆరోగ్యం బాగా క్షీణించిందంటున్న వైద్యులు
టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. కొన్ని రోజుల కిందట ఆయన అస్వస్థతకు గురవడంతో కుటుంబసభ్యులు స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని కిమ్స్కు తరలించారు. ప్రస్తుతం అక్కడే చికిత్స పొందుతున్నారు. ఇటీవలే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనను పరామర్శించారు. మెరుగైన చికిత్స అందిస్తున్నామని చంద్రబాబుకు కిమ్స్ వైద్యులు వివరించారు.
ఇదిలా ఉండగా.. టీడీపీలో తమకు తగిన గుర్తింపు దక్కలేదని ఆనం వివేకానంద రెడ్డి సోదరుడు ఆనం రామనారాయణ రెడ్డి ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. మరో వారం రోజుల్లో ఆనం రామ నారాయణ వైసీపీలో చేరే అవకాశం ఉందనే వాదనలు వినపడుతున్నాయి. ఇప్పటికే రామనారాయణ వైసీపీ జగన్ తో సంప్రదింపులు జరిపారని.. చంద్రబాబు బుజ్జగించడానికి ప్రయత్నించినా.. పెద్ద లాభం కలగలేదనే ప్రచారం కూడా జరుగుతోంది.