ఏపీలో పొత్తులపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరితో పొత్తు లేకుండానే టీడీపీ 160 సీట్లు గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
వచ్చే ఏపీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో పొత్తుల వ్యవహారం హాట్ హాట్గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై రాష్ట్రానికి చెందిన అధికార, ప్రతిపక్షనేతలు రకరకాలుగా స్పందిస్తున్నారు. తాజాగా టీడీపీ (tdp) సీనియర్ నేత , మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు (prathipati pulla rao) స్పందించారు. రానున్న ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు లేకుండానే సింగిల్గా 160 సీట్లను గెలిచే సత్తా టీడీపీకి ఉందని ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం చిలకలూరిపేటలో మీడియాతో మాట్లాడిన ప్రత్తిపాటి... టీడీపీ అధినేత చంద్రబాబు (chandrababau naidu), పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (nara lokesh) పర్యటనలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. రాష్ట్రానికి చంద్రబాబు అవసరం ఉందని ప్రజలు ఎదురు చూస్తున్నారని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా వైసీపీ (ysrcp) పాలనపై ప్రత్తిపాటి పుల్లారావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం జగన్ అసమర్థ పాలనలో ప్రజలు రోడ్డెక్కే పరిస్థితి వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీ పాలన విధ్వంసాలు, అరాచకాలు, కూల్చివేతలతోనే సరిపోయిందంటూ ఎద్దేవా చేశారు.. విషపూరిత మద్యాన్ని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో విక్రయిస్తున్నారని ప్రత్తిపాటి ఆరోపించారు. ఇళ్ల స్థలాల పేరుతో ఎంత అవినీతి చేశారో ప్రజలందరికీ తెలుసన్న ప్రత్తిపాటి.. వైసీపీ ప్లీనరీలకు రావడానికి సొంత పార్టీ వారే ముఖం చాటేస్తున్నారంటూ దుయ్యబట్టారు.