ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడు: టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిపై ఉద్యోగుల ఫైర్

By Nagaraju penumalaFirst Published Apr 26, 2019, 4:55 PM IST
Highlights

ఈ సందర్భంగా రామకృష్ణ చెన్నైకు దొంగ సరుకు రవాణా చేస్తున్నారని ఆరోపించారు. ఆయన అవినీతిపరుడంటూ విరుచుకుపడ్డారు. దొంగ వ్యాపారం ద్వారా కోట్లాది రూపాయలు పన్ను ఎగ్గొడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎమ్మెల్యే రామకృష్ణలా అవినీతి పరులు కాదన్నారు. రామకృష్ణ ఉద్యోగులతో మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు.  
 

విజయవాడ : నెల్లూరు జిల్లా వెంకటగిరి టీడీపీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ప్రభుత్వ ఉద్యోగిపై చేసిన బూతుపురాణంపై ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. వివాదాస్పద వ్యాఖ్యలను ఆయన వర్గీయులు సమర్థించుకుంటుంటే ఉద్యోగ సంఘాలు మత్రం సీరియస్ గా తీసుకున్నాయి. 

ప్రభుత్వ ఉద్యోగిపై ఎమ్మెల్యే రామకృష్ణ చేసిన వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని ఏపీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగిపై చేసిన విమర్శలకు ఎమ్మెల్యే రామకృష్ణపై సీఎం చంద్రబాబు చర్యలు తీసుకోవాలని కోరారు. 

శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన ఉద్యోగికి ఎమ్మెల్యే రామకృష్ణ బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ చెన్నైకు దొంగ సరుకు రవాణా చేస్తున్నారని ఆరోపించారు. ఆయన అవినీతిపరుడంటూ విరుచుకుపడ్డారు. 

దొంగ వ్యాపారం ద్వారా కోట్లాది రూపాయలు పన్ను ఎగ్గొడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎమ్మెల్యే రామకృష్ణలా అవినీతి పరులు కాదన్నారు. రామకృష్ణ ఉద్యోగులతో మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు.  

ఎన్నికల్లో అప్పటికప్పుడు 45 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులను విధుల్లోకి తీసుకున్నారని సూర్యనారాయణ స్పష్టం చేశారు. వారందరికి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చిత్తూరు, విశాఖపట్నం జిల్లా కలెక్టర్లు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఇవ్వకుండా అడ్డుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయన్నారు. 

ఇద్దరు కలెక్టర్లపై తమకు అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఇవ్వాలని ఇప్పటికే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కొంత మంది అధికారులు అధికార పార్టీకి తాబేదారుల్లా పని చేస్తున్నారని మండిపడ్డారు. సోమవారానికి ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులందరికీ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఇవ్వాలని లేని పక్షంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని హెచ్చరించారు. 
 

click me!