
తెలుగుదేశంపార్టీకి నంద్యాల ఉపఎన్నికలో భారీ షాక్ తగిలింది. ఈ షాక్ స్వయంగా ఎన్నికల సంఘమే ఇవ్వటం గమనార్హం. 2017, జనవరి 1వ తేదీకి నంద్యాల ఓటర్లజాబితాలో ఎవరైతే ఓటర్లుగా ఉన్నారో వారికి మాత్రమే జరగబోయే ఉపఎన్నికలో ఓటు హక్కుంటుందని గట్టిగా చెప్పింది ఎన్నికల సంఘం. నిజంగా ఎన్నికల సంఘం ఆదేశాలు టిడిపికి ఊహించని దెబ్బే. ఎందుకంటే, ఉపఎన్నికలో గెలవటానికి టిడిపి నానా అవస్తలు పడుతున్నది.
అయితే, సమస్యను అధిగమించేందుకు టిడిపి నేతలు ముందస్తు వ్యూహంగా కొన్నివేలమందిని ఓటర్లుగా నమోదు చేసారు. నంద్యాలలో ఉపఎన్నికలు అనివార్యమని తేలినప్పటి నుండి సుమారు 15 వేల మందిని కొత్తగా ఓటర్ల జాబితాలో చేర్పించారు. ఇదే విషయమై విపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా అధికార పార్టీ పట్టించుకోలేదు. అయితే, తాజా ఇసి ఆదేశాలతో ఎన్నికల కమీషనర్లు కొత్తగా నమోదైన ఓటర్లను జాబితాలో నుండి తొలగించటం తప్పనిసరి అయింది. అసలే కష్టాల్లో ఉన్న టిడిపికి ఎన్నికల సంఘం ఆదేశాలు షాక్ కొట్టినట్లైంది.