లేడీ డాక్టర్ శిల్ప ఆత్మహత్య ఘటనను నిరసిస్తూ ఎస్వీ ఆసుపత్రి వద్ద డాక్టర్లు ఆందోళన నిర్వహించారు. శిల్ప మృతిపై సమగ్ర దర్యాప్తు చేయాలని డాక్టర్లు డిమాండ్ చేశారు
తిరుపతి: లేడీ డాక్టర్ శిల్ప ఆత్మహత్య ఘటనను నిరసిస్తూ ఎస్వీ ఆసుపత్రి వద్ద డాక్టర్లు ఆందోళన నిర్వహించారు. శిల్ప మృతిపై సమగ్ర దర్యాప్తు చేయాలని డాక్టర్లు డిమాండ్ చేశారు. తన భార్య మృతికి ప్రోఫెసర్ల వేధింపులే కారణమని శిల్ప భర్త రూపేష్ ఆరోపిస్తున్నారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో రుయూ ఆసుపత్రిలో పనిచేస్తున్న సమయంలో ప్రోఫెసర్లు కొందరు తనను లైంగికంగా వేధింపులకు గురిచేశారని శిల్ప రాష్ట్ర గవర్నర్కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై గవర్నర్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ వైద్యులు ఈ ఘటనపై విచారణ నిర్వహించి వీసీకి నివేదికను అందించారు.
ఈ ఏడాది ఏప్రిల్ 16వ, తేదీన శిల్ప పీజీ పరీక్షలు రాశారు. పరీక్షల ఫలితాలు ఇటీవల వచ్చాయి.ఈ పరీక్షల్లో శిల్ప ఫెయిలైంది. అయితే దీనిపై ఆమె రీ వాల్యూయేషన్ కోరింది. రీ వాల్యూయేషన్లో కూడ అవే మార్కులు వచ్చినట్టు నిర్ధారించారు.
తాను లైంగిక వేధింపుల విషయమై గవర్నర్కు ఫిర్యాదు చేయడంతోనే ఉద్దేశ్యపూర్వకంగానే ఫెయిల్ చేశారని శిల్ప తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసేది. అయితే ఈ విషయమై లైంగిక వేధింపులకు పాల్పడిన డాక్టర్లపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా తనపై కక్ష సాధింపులకు పాల్పడ్డారని బాధితురాలు తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసేది.
శిల్ప ప్రస్తుతం ఎస్వీ మెడికల్ కాలేజీలోని పీడీయాట్రిక్ విభాగంలో పనిచేస్తున్నారు. ఇవాళ ఉదయం ఆమె తన బెడ్రూమ్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది.ఈ విషయం తెలిసిన వెంటనే ఎస్వీ మెడికల్ కాలేజీలో తోటి డాక్టర్లు ఆందోళన నిర్వహించారు. శిల్ప మృతిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
ఐదేళ్ల క్రితం డాక్టర్ రూపేష్ను శిల్ప ప్రేమించి వివాహం చేసుకొన్నారు. రూపేష్ ఎముకల డాక్టర్ గా పనిచేస్తున్నారు. శిల్ప పీడియాట్రిక్ విభాగంలో పనిచేస్తున్నారు. అయితే ఈ దంపతులకు మూడున్నర ఏళ్ల బాబు ఉన్నారు. తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని రూపేష్ చెప్పారు.
లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసిన సమయంలో శిల్పపైనే కొందరు తనపై దుష్ప్రచారం చేయడాన్ని కూడ ఆమె తట్టుకోలేకపోయింది.ఈ పరిణామాలపై శిల్ప ఆత్మహత్య చేసుకొందని సమాచారం. శిల్ప మృతిపై అన్ని రకాల కోణాల్లో విచారణ జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.
ఇదిలా ఉంటే పీజీ పరీక్షల్లో ఫెయిల్ అయిన మానసికంగా కుంగిపోయిందని సన్నిహితులు చెబుతున్నారు. అయితే మరోసారి పరీక్ష రాస్తానని చెప్పిందన్నారు.అయితే ఆసుపత్రికి రావాలంటే భయంగా ఉందని ఇటీవల కాలంలో కొందరు సన్నిహితుల వద్ద ఆమె చెప్పిందనే ప్రచారం సాగుతోంది. ఎందుకు ఆమె ఈ వ్యాఖ్యలు చేశారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
లైంగిక వేధింపులకు పాల్నడిన వారే తనపై తప్పుడు ప్రచారం చేసినా శిల్ప తట్టుకోని నిలబడిందని... ఇటీవల కాలంలో భయంగా ఉందని ఆమె ఎందుకు అందో అర్థం కావడం లేదని మృతురాలి సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు.
ఈ వార్త చదవండి:షాక్: లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసిన డాక్టర్ శిల్ప ఆత్మహత్య